బంజారాహిల్స్,ఆగస్టు 11: ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్లోని ఓ ఇంట్లో సుంకర వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తుంటాడు. అదే ఇంట్లో అతడి భార్య ప్రమీల పనిమనిషిగా చేస్తోంది.
ఈ నెల 7న మణికొండలోని కొడుకువద్దకు వెళ్లిన భార్యాభర్తలు మంగళవారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉన్నాయి. లోనికి వెల్లి చూడగా సూట్కేసులో ఉండాల్సిన రెండున్నర తులాల బంగారు గొలుసు కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడి ఉంటారని ప్రమీల బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.