హైదరాబాద్: ఆయుర్వేదం మనిషికి మార్గదర్శనం చేస్తుంది. భోజనం ఎలా తీసుకోవాలనే విషయంలోనూ కీలక సూచనలు చేసింది. నిజానికి మనిషి బతికేది తినడానికే, బతుకుతున్నది తిన్నందుకే. కాబట్టి ఆహారం విషయంలో నియమాలు పాటించడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మనిషిలో జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే తొమ్మిది ఆయుర్వేద సూత్రాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
తినడానికి 9 ఆయుర్వేద సూత్రాలు..
1. ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినాలి
ఆకలితో ఉన్నట్లు అనిపించినప్పుడు కాకుండా నిజంగా ఆకలి వేసినప్పుడే తినాలి. లేదంటే జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు తప్పవు.
2. ప్రశాంతమైన, సౌకర్యవంతమైన ప్రదేశంలో తినాలి
హడావిడిగా ఎక్కడపడితే అక్కడ నిలబడి తినకుండా, ప్రశాంతంగా కూర్చుని తినాలి. పరధ్యానంగా.. అంటే టీవీ చూస్తూనో, పుస్తకం చదువుతూనో లేక ఫోన్, ల్యాప్టాప్ లాంటివి వాడుతూనో అస్సలు భోజనం చేయకూడదు. అలా చేయడంవల్ల తిన్న ఆహారం ఒంటికి పట్టదు.
3. సరైన పరిమాణంలో తినాలి
వేర్వేరు సమయాల్లో వేర్వేరు కోరికలు కలుగుతుంటాయి. అంతేకాదు కొందరు ఎక్కువ తినగలుగుతారు, ఇంకొందరు తక్కువ తినగానే కడుపు నిండినట్లు ఫీల్ అవుతుంటారు. కాబట్టి మీ శరీరానికి తగ్గట్టుగా సరైన మోతాదులో రోజూ తినేంత మాత్రమే తినండి. రుచిగా ఉంది, ఇష్టమైనది అని ఎక్కువ తింటే జీర్ణవ్యవస్థకు మంచిది కాదు.
4. వేడివేడి భోజనం తినాలి
ఆహారం ఎప్పుడైనా వేడివేడిగా, తాజాగా ఉన్నప్పుడే తినాలి. సమయం లేదని మూడు పూటలకు ఒకేసారి వండుకుని తినడం, మిగిలింది కదా అని ఫ్రిజ్ లో దాచుకుని తినడం లాంటివి చేయడంవల్ల జీర్ణశక్తిని త్వరగా కోల్పోతారు. వేడివేడిగా తినడంవల్ల జీర్ణాశయంలో ఎంజైమ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి.
5. నాణ్యమైన ఆహారాన్ని తినాలి
ఎప్పుడైనా నాణ్యమైన భోజనం మాత్రమే చేయాలి. మీ భోజనంలో రసం, మజ్జిగ లాంటివి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. అలాగే పోషక శోషణను మెరుగుపరుస్తాయి. కాబట్టి పొడిగా ఉండే ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
6. మీకు పడనివి తినకూడదు
కొందరికి కొన్ని ఆహార పదార్థాలు పడవు. ఉదాహరణకు పాలు తాగడంవల్ల కొందరికి, చేపలు తినడంవల్ల ఇంకొందరికి కడుపులో సమస్యలు వస్తుంటాయి. దీనినే ఫుడ్ ఎలర్జీ అంటారు. కాబట్టి మీకు ఏదీ పడుతుందో వాటినే తినండి.
7. ఆస్వాదిస్తూ తినాలి
భోజనం చేయడానికి కూడా మీలోని ఐదు ఇంద్రియాలను ఉపయోగించాలి. అంటే ఆహారం వాసన పీల్చుకోవడం, తింటున్న కంచం రూపాన్ని చూడటం, మీ ఆహార ఆకృతిని, విభిన్న రుచులను చూడటం, తినేటప్పుడు వచ్చే శబ్దాలను వినడం ఇలా సంతృప్తిగా భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.
8. బాగా నమిలి తినాలి
సమయం లేదనో లేక అలవాటు ప్రకారమో చాలా మంది ఆహారాన్ని మింగేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా చేయడంవల్ల మీ జర్ణవ్యవస్థపై మరింత ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల మీ జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది.
9. క్రమం తప్పకుండా తినాలి
టైమ్ లేదని లేక రుచిగా లేదని కొందరు ఆహారాన్ని స్కిప్ చేస్తుంటారు. అలా చేయడంవల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆహారం తినడమే కాక.. వీలైనంత వరకూ రోజూ ఒకే సమయాన్ని మెయింటెయిన్ చేయడంవల్ల ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతుంది.