హైదరాబాద్: మన ఆహారపు అలవాట్లలో పెరుగు ముఖ్య భాగంగా మారిపోయింది. పెరుగును ఇష్టపడని వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆహారం చివరలో కొంతైనా పెరుగన్నం లేకపోతే చాలామందికి భోజనం చేసినట్టే ఉండదు. ఇక కమ్మటి గడ్డ పెరుగేసుకుని తింటే ఆ మజానే వేరు. పెరుగుతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. మరి ఇంతటి ప్రాముఖ్యమున్న పెరుగును చలికాలంలో చాలామంది దూరం పెడుతారు. చలికాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు లాంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయని భయపడుతారు. అయితే, ఆరోగ్య నిపుణులు మాత్రం అది ఒట్టి అపోహేనని కొట్టి పారేస్తున్నారు. చలికాలం అయినా పెరుగు తినడంవల్ల ప్రయోజనమే తప్ప నష్టం లేదని చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలేమిటో తెలుసుకుందామా..?
పెరుగుతో ప్రయోజనాలు..
పెరుగు తినడంవల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగుతుంది. దాంతో మన శరీరం అనారోగ్య సమస్యలను చురుగ్గా ఎదుర్కోగలుగుతుంది. ముఖ్య విషయం ఏందంటే.. జలుబు, దగ్గు లాంటి సమస్యలు పెరుగుతాయని చాలామంది పెరుగు తినడం మానేస్తారు. కానీ, అలాంటి సమస్యలు తగ్గడానికి పెరుగే సరైన ఔషధమని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో కొంతమందిని మలబద్దకం సమస్య వేధిస్తుంటుంది. పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి చలికాలంలో సైతం పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా లాభమే తప్ప నష్టం ఉండదు.
పెరుగులో కాల్షియం ఉంటుంది. దీనివల్ల శరీరంలోని కండరాలకు బలం చేకూరుతుంది. అంతేగాక ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా తయారవుతాయి. దంత సమస్యలు కూడా దూరమవుతాయి.
పెరుగును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడంవల్ల రక్తంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల హార్ట్ అటాక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు (బీపీ)ని సైతం పెరుగు కంట్రోల్ చేస్తుంది.
అస్తమా బాధితులూ తస్మాత్ జాగ్రత్త
అయితే పెరుగును సాధ్యమైనంత వరకు పగటిపూట మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిళ్లు పెరుగు తింటే మ్యూకస్ పెరుకునే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు.
ముఖ్యంగా ఆస్తమా సమస్య ఉన్నవారు రాత్రిళ్లు పెరుగును అసలే ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా రోగులు రాత్రిళ్లు పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుందంటున్నారు.
అందువల్ల ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు మినహా మిగతా వాళ్లు చలికాలంలో కూడా నిశ్చింతగా పెరుగును ఆహారంగా తీసుకోవచ్చు.