World Tuberculosis Day | ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన వ్యాధి టీబీ. దీన్ని తెలుగులో క్షయ వ్యాధిగా పిలుస్తారు. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా టీబీ వస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, గర్భాశం వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన మహమ్మారిపై 2030 నాటికి టీబీపై విజయం సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో ) కూడా లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్తుంది. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ( World Tuberculosis Day ) జరుపుతున్నారు. నేడు క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా.. అసలు టీబీ ఎలా వస్తుంది? ఇది ఏ అవయవాలపై ప్రభావం చూపిస్తుంది? దీన్ని ఎలా గుర్తించాలి? చికిత్స పద్ధతులు వంటి పూర్తి సమాచారం ఒకసారి తెలుసుకుందాం..
మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇది ఇతరులకు సోకుతుంది. క్షయ వ్యాధి ఇప్పటికీ ప్రపంచాన్ని వేధిస్తోంది. మన దేశంలో కూడా టీబీ కేసులు భారీగానే ఉన్నాయి.
విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం రావడం, ఛాతిలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండటం , రాత్రి వేళలో చెమటలు పట్టడం, ఛాతిలో నీరు చేరడం వల్ల దమ్ము కూడా రావడం వంటి లక్షణాలు టీబీ వ్యాధికి చెందినవే. టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో బ్యాక్టీరియా సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపించవచ్చు. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. కానీ, వ్యాధి సోకిన రెండు నుంచి ఐదేండ్ల లోపు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి.
అత్యాధునిక రోగనిర్ధారణ విధానాలు, చికిత్స అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ క్షయ వ్యాధి మానవాళికి వణుకు పుట్టిస్తోంది. రోగ నిర్ధారణ కోసం తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్-రే, ల్యాటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష, దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే న్యూరలాజికల్ పరీక్షలు, సూక్ష్మజీవుల పెరుగుదలను తెలిపే కల్చరల్ పరీక్షలతో పాటు కచ్చితమైన నిర్ధారణ కోసం బ్రోంకోస్కోపీ, థొరాకోస్కోపీ మరియు సిటీ గైడెడ్ బయాప్సీ అనే పరీక్షలు చేస్తారు.
హెచ్ఐవీ పేషెంట్లు, డయాబెటిస్ మెల్లిటస్, పోషకాహార లోపం ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో, కిడ్నీ మార్పిడి తర్వాత, కరోనా వైరస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న రోగులు, క్యాన్సర్ కీమోథెరపీలో ఉన్న రోగులకు టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
టీబీ పూర్తిగా నయం కావడానికి క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గిపోయాయని మందులు వాడటం ఆపేస్తుంటారు. వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని కనీసం 6 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో 18-24 నెలల పాటు కూడా చికిత్సను పొడిగించాల్సి రావచ్చు. ఇవి ఒకింత ప్రమాదకరమైనవి కావడంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త పడటం మంచిది.
జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) భారతదేశంలో టీబీ నిర్మూలనకు సంబంధించిన ప్రధాన ప్రభుత్వ సంస్థ. టీబీ నిర్మూలన కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (NSP) 2017–2025 వ్యాధిపై వ్యూహాత్మకంగా సమరం సాగిస్తోంది. “డిటెక్ట్ – ట్రీట్ – ప్రివెంట్ – బిల్డ్” వంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (NSP).
– డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి, MBBS, MD, FCCP, (IDCC)
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ & స్లీప్ మెడిసిన్
రెనోవా హాస్పిటల్స్, సనత్నగర్, హైదరాబాద్.