మా బాబు వయసు పద్నాలుగు. ఎప్పుడూ ముభావంగా ఉంటాడు. ఏది అడిగినా ఓ పట్టాన స్పందించడు. చికాకుపడతాడు. ఎప్పుడూ తన గదిలోనే ఒంటరిగా ఉంటాడు. వాడి మానసిక స్థితి పట్ల ఆందోళనగా ఉంది. ఏం చేయమంటారు?
కౌమారంలో పిల్లలు ముభావంగా ఉండటం సాధారణం. పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడరు కూడా. కాకపోతే తమ వయసు వారితో ఇట్టే కలిసిపోతారు. ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువ. పెరగాల్సినంత ఎత్తు పెరగకపోవడం, యుక్త వయసు వచ్చినా ఆ లక్షణాలు కనిపించకపోవడం.. తదితర కారణాలతో తోటి పిల్లలు ఎగతాళి చేస్తుంటారు. పాఠశాలలో మీ బాబు ప్రవర్తన ఎలా ఉందన్నది చెప్పలేదు. కొవిడ్ తర్వాత డిజిటల్ వ్యసనం బాగా పెరిగిపోయింది. మీ బిడ్డ ఒంటరిగా గదిలో కూర్చుని.. సెల్ఫోన్, ట్యాబ్లో ప్రత్యేకించి ఏదైనా అంశానికి సంబంధించిన వీడియోలు, వెబ్సైట్లు చూస్తున్నాడా అనేది గమనించండి. ఈ వయసు పిల్లలతో మనం స్నేహితుల్లా మెలగాలి. తల్లిదండ్రులైనా సరే.. తమను ఆదేశించడం, తమ తప్పులను ఎత్తి చూపడం వాళ్లకు నచ్చకపోవచ్చు.
శరీరాకృతికి సంబంధించి.. ఎత్తు, లావు, రంగు మొదలైన విషయాల్లో పట్టింపు ఎక్కువగా ఉంటుంది. చదువుల ఒత్తిడి కూడా ఈ దశలోనే అధికం. బాబుతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపండి. కలిసి భోంచేయండి. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. తనకు మాట్లాడే అవకాశం కల్పించండి. మేమున్నామనే భరోసా ఇవ్వండి. పిల్లలు మరీ ఎక్కువ ముభావంగా ఉండటం కూడా మంచి లక్షణం కాదు. మీ పీడియాట్రీషి యన్ను ఓ సారి సంప్రదించండి. అవసరమైతే.. సైకియాట్రిస్టు సలహా తీసుకోండి.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్