Millets | శతాబ్దాలుగా ప్రాచీన ధాన్యాలు ప్రపంచంలోని అనేక నాగరికతలకు నిశ్శబ్దంగా పోషణ అందించాయి. మిల్లెట్లు కఠిన వాతావరణాల్లో కూడా ప్రజలను నిలబెట్టాయి. పప్పుధాన్యాలు వ్యవసాయ ఆధారిత జీవనశైలికి శక్తినిచ్చాయి. సంప్రదాయ మొలకల విధానాలు సాధారణ ధాన్యాలను పోషక విలువలతో నిండిన ఆహారంగా మార్చాయి. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పాతకాలపు ఆహారాలు మళ్లీ ప్రాచుర్యం పొందుతున్నాయి. నోస్టాల్జియా కోసం కాదు, ఆధునిక పోషకాహారంలో కీలక పాత్ర పోషించే పర్ఫార్మెన్స్ ఫుడ్ గా తిరిగి వస్తున్నాయి. ఇటీవల కాలంలో తినే అలవాట్లు భారీగా మారాయి. ఇప్పుడు ప్రజలు కేవలం ఆకలి తీర్చే ఆహారం కాకుండా, శక్తి, ఏకాగ్రత, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్నాక్స్ను కోరుకుంటున్నారు. జొన్నలు, క్వినోవా, ఎర్రబియ్యం, శనగలు, పప్పుధాన్యాలు వంటి ప్రాచీన ధాన్యాలు సహజంగా ప్రోటీన్, ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి కాబట్టి అకస్మాత్తుగా చక్కెర పెరగకుండా రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తాయి.
రిఫైన్డ్ గ్రెయిన్స్తో తయారైన స్నాక్స్ ఎక్కువగా ఖాళీ క్యాలరీలను మాత్రమే అందిస్తే, ప్రాచీన ధాన్యాలు పోషక సాంద్రతను అందిస్తాయి. ఇవి పర్యావరణానికి కూడా మేలు చేసే పంటలు. తక్కువ వనరులతో పెరిగే వీటి వల్ల ప్రకృతికి కూడా నష్టం తక్కువ. అయితే ఈ ధాన్యాల అసలు శక్తి మొలకలు వేయించినప్పుడు బయటపడుతుంది. మొలకలు వేయించడం అనేది మనిషి ఉపయోగించిన పురాతన ఆహార తయారీ విధానాల్లో ఒకటి. ధాన్యాలు మొలకెత్తే సమయంలో ఎంజైములు చురుకుగా మారి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లను సులభంగా జీర్ణమయ్యే రూపంలోకి మార్చుతాయి. ఈ ప్రక్రియ పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సులభం చేస్తుంది. అలాగే ముందుగా నిశ్చేష్టంగా ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చురుకుగా మారతాయి.
సరళంగా చెప్పాలంటే, మొలకల ద్వారా ధాన్యం ఒక సాధారణ పదార్థం నుంచి పోషక శక్తి కేంద్రంగా మారుతుంది. అందుకే భారతీయ వంటల్లో మొలకలు వేసిన పప్పులు, మధ్యప్రాచ్య దేశాల్లో ఫెర్మెంటెడ్ ధాన్యాలు వంటి సంప్రదాయ ఆహారాల్లో ఇవి ముఖ్యంగా కనిపిస్తాయి. ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ప్రజలకు ఎక్కువ శక్తి అవసరం అవుతోంది. పని ఒత్తిడి, వ్యాయామం, ప్రయాణం వంటి అంశాలు శరీరాన్ని అలసటకు గురిచేస్తాయి. ఈ నేపథ్యంలో కొత్త తరహా పర్ఫార్మెన్స్ స్నాక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. మొలకలు వేసిన ధాన్యాలను ఆధునిక ఫుడ్ సైన్స్తో కలిపి తయారు చేస్తున్న ఈ స్నాక్స్ ప్రోటీన్, ఫైబర్ను అందిస్తూ ఎక్కువగా ఫ్రై చేయకుండా బేక్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి.
మునుపటి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారం అంటే రుచి లేకపోవడం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ప్రాచీన ధాన్యాలతో కొత్త రుచులు, టెక్స్చర్లు కలిపి తయారు చేస్తున్న స్నాక్స్ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా రుచిలో కూడా మెప్పిస్తున్నాయి. క్రంచీ స్టిక్స్, పఫ్స్, గ్రెయిన్ బైట్స్ వంటి కొత్త రూపాల్లో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఒక ఫుడ్ ట్రెండ్ మాత్రమే కాదు, జీవనశైలిలో మార్పు కూడా. ఇప్పుడు ప్రజలు స్మార్ట్ స్నాకింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. అంటే రుచి, సౌలభ్యం, పోషక విలువలు ఉండే ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాచీన ధాన్యాలు, మొలకల పదార్థాలు సంప్రదాయం, ఆధునికతను కలిపే వంతెనగా నిలుస్తున్నాయి. భవిష్యత్తు ఆహారం గతంలో ఉన్న జ్ఞానంలోనే వేర్లు కలిగి ఉందని చెప్పవచ్చు. మొలకలు వేయడం, సంపూర్ణ ధాన్యాలు, వృక్షాధారిత ప్రోటీన్లు వంటివి కొత్త ట్రెండ్స్ కాదు, మన పూర్వీకులు అనుసరించిన మార్గాలు. ఇప్పుడు వాటిని ఆధునిక రూపంలో తీసుకువస్తూ, ఆరోగ్యకరమైన ఆహారానికి కొత్త నిర్వచనాన్ని అందిస్తున్నారు.