గతంలో చర్చించినట్టు అతిసార వ్యాధి పిల్లలను తీవ్ర అనారోగ్యం పాలు చేస్తుంది. కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారుతుంది. కాబట్టి, వ్యాధిపట్ల అవగాహన పెంచుకుని, వైద్యుల సలహాతో బిడ్డకు తగిన చికిత్స అందించాలి. నవజాత శిశువు శరీరంలో దాదాపు 75 శాతం నీరే ఉంటుంది. ఆ తరువాత క్రమంగా తగ్గిపోయి 60 శాతానికి చేరుకొంటుంది. నీరు శరీరంలో రెండు రకాలుగా ఉంటుంది.
1. కణజాలం బయట ఉండే నీరు..
దీనినే Extracellular Fluid (ECE) అంటారు. ఉదా: రక్తం, లాలాజలం, చెమట, మూత్రం.
2. కణజాలం లోపల ఉండే నీరు. దీన్ని Intracellular Fluid (ICF) అంటారు.
అతిసార వ్యాధిలో శరీరం కణజాలం బయట ఉండే నీటిని నష్టపోతుంది.. దీనిలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, జింక్, సోడియం బైకార్బొనేట్ లాంటి పదార్థాలు ఉంటాయి. శరీరంలో ఈ పదార్థాల హెచ్చుతగ్గులను మూత్రపిండాలు నియంత్రిస్తాయి. చిన్నపిల్లల మూత్రపిండాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉండవు కాబట్టి, బిడ్డ బలహీనంగా ఉన్నప్పుడు ఈ పదార్థాల హెచ్చుతగ్గుల వల్ల ఫిట్స్, స్పృహ కోల్పోవడం తదితర ఇబ్బందులు రావచ్చు. ఈ పదార్థాల పరిమాణంలో మార్పుల ప్రకారం నీరు కూడా కణజాలం బయటినుంచి కణం లోపలికి రావచ్చు లేదా కణం లోపలినుంచి బయటికి పోవచ్చు. అతిసార వ్యాధి సమయంలో పిల్లల శరీరం చిన్నగా ఉన్నా.. పెద్దలతో సమానంగా నీరు, ఖనిజ లవణాలు బయటికి పోతాయి. పిల్లల శరీర పరిమాణం కంటే కూడా.. పేగుల పొడవు, విస్తీర్ణం చాలా ఎక్కువ. ఉదా: 70 కిలోల బరువున్న పెద్దల శరీరం నుంచి విరేచనం రూపంలో ఒక లీటరు నీళ్లు బయటికి పోతే, కణజాలం బయటి నీరు దాదాపు 7% తగ్గినట్టు. అదే 7 కిలోల శిశువు శరీరం నుంచి 800 మి.లీ.ల నీరు విరేచనమైతే కణజాలం బయటి నీరు 50% తగ్గినట్టు. అందువల్లనే విరేచనాలైనప్పుడు పిల్లలు త్వరగా బలహీనతకు లోనవుతారు. కాబట్టి, కన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలి.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి ,పిల్లల వైద్య నిపుణులు