జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) కీలక ప్రకటన చేసింది. మహమ్మారి పుట్టుకొచ్చిన రెండేండ్ల తర్వాత తాజా వేరియంట్లను అడ్డుకునేలా నూతన వ్యాక్సిన్లు అవసరమని పిలుపు ఇచ్చింది.
నూతన వేరియంట్ల ద్వారా సోకే ఇన్ఫెక్షన్ను నివారించడంతో పాటు వ్యాప్తిని నిలువరించేలా వ్యాధి తీవ్రతను మరణాలను నిరోధించేలా నూతన వ్యాక్సిన్లను అభివృద్ధి చేయాలని వ్యాక్సిన్ కాంపోజిషన్పై ఏర్పాటైన డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా గ్రూప్ ఓ ప్రకటనలో పిలుపు ఇచ్చింది.
కొవిడ్-19 వ్యాక్సిన్ల బూస్టర్ డోసులను పదేపదే ఇవ్వడం నూతన వేరియంట్లను నిరోధించేందుకు సరైన వ్యూహం కాదని డబ్ల్యూహెచ్ఓ నిపుణులు హెచ్చరించారు. మరోవైపు అమెరికా, యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.