World Encephalitis Day | దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. దీన్ని ఇంగ్లీష్లో ఎన్సెఫలైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి కారణంగా మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పడి వాటి పనితీరులో అవరోధాలు ఏర్పడతాయి. అయితే వ్యాధి వృద్ధి కాలాన్ని బట్టి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మెదడువాపు వ్యాధిగా విభజిస్తారు. సాధారణంగా స్వల్పకాలిక మెదడువాపు వ్యాధిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి తీవ్రత, మరణాల రేటు కూడా పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఏటా దాదాపు 20 నుంచి 30 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందువల్ల మెదడువాపు వ్యాధి గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడువాపు వ్యాధి దినోత్సవం ( World Encephalitis Day ) జరుపుతారు. ఈ క్రమంలో అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి? ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స అవసరమో రెనోవా హాస్పిటల్స్ ( సనత్నగర్ ) కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ చక్రధర్ రెడ్డి.ఎన్ చెప్పిన విషయాలు ఒకసారి చూద్దాం.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా 30 శాతం మంది మెదడువాపు వ్యాధి కేసులు వైరస్ల వల్ల కలుగుతాయి. ముఖ్యంగా జపనీస్ ఎన్సెఫలైటిస్ (JE) వైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV), మీజిల్స్ వైరస్, రేబిస్ వైరస్, ఇన్ఫ్లూయెంజా వైరస్, ఇతర వైరస్ల వల్ల మెదడువాపు వ్యాధి వస్తుంది. అయితే ఈ వైరస్లు డెంగ్యూ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. బ్యాక్టీరియా, పారసైట్స్ కూడా మెదడువాపు వ్యాధిని కలిగించవచ్చు. విషపదార్థాలు, ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధులు, అరుదుగా వాడే పలు వ్యాక్సిన్ల వల్ల కూడా మెదడువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
మెదడువాపు సోకిన వారిలో సాధారణంగా తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్చ కదలిక లోపాలు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
బ్లడ్ టెస్టుతో పాటు యాంటీబాడీ టెస్ట్, పీసీఆర్ టెస్ట్, వెన్ను నీరు పరీక్ష, EEG, MRI స్కాన్ల ద్వారా మెదడు పనితీరును పరిశీలిస్తారు. దీని ద్వారా మెదడువాపు తీవ్రతను అంచనా వేయవచ్చు. మెదడు వాపు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తుల్లో వీలైనంత త్వరగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి చికిత్స అందించడం చాలా అవసరం. వ్యాధి తీవ్రత, వ్యాధి నిర్ధారణ, ఎంత తొందరగా చికిత్స అందించామనే సమయాన్ని బట్టి రికవరీ ఉంటుంది.
మెదడువాపు వ్యాధి రోగులకు న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో వైద్యం అందించబడుతుంది. కొన్ని రకాల వైరస్లకు మాత్రమే యాంటీ వైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మూర్ఛ నివారణ మందులు, నాడీ కణాల్లో వాపు తగ్గించేందుకు వాడే మందులను రోగులకు అందిస్తుంటారు. వీటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమల నివారణ కార్యక్రమాల ద్వారా మెదడువాపు వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం వల్ల కూడా పలు రకాల మెదడువాపు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.