అన్ని డివిజన్లలో ఏర్పాటు చేస్తాం
మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, జూన్ 20: నగర ప్రజల ఆరోగ్యం కోసమే పట్టణ ప్రగతి నిధులతో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 7, 14, 53, 57 డివిజన్లలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాకింగ్ ట్రాక్స్ అభివృద్ధి చేయడంతో పాటు ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి విడుతలో రూ. 3.60 కోట్లతో 30 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, మరో 30 ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి డివిజన్లో ఓపెన్ జిమ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు అన్ని రకాల వ్యాయామం చేసుకునేలా అధునాతన పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నగరంలో పట్టణ ప్రగతి నిధులతో పార్కులు, వైకుంఠధామాలు, వాకింగ్ ట్రాక్స్ పనులు చేపట్టామన్నారు. నగరంలో 14 పార్కులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే 3 పార్కుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. రూ. 2 కోట్లతో మానేరు శ్మశాన వాటికను అధునాతన వసతులతో సిద్ధం చేస్తున్నామన్నారు. నగరంలో రూ.5.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు పాలకవర్గం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, బండ సుమ, తుల శ్రీదేవీచంద్రమౌళి, ఆకుల పద్మ, నాయకులు పాల్గొన్నారు.