సిడ్నీ, జూలై 31: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న మధుమేహానికి సరికొత్త చికిత్స విధానాన్ని అందుబాటులోకి తేవడంలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. పాంక్రియాటిక్ కణాల్లో ఇన్సులిన్ ఉత్పత్తిని పునరుద్ధరించే కొత్త పద్ధతిని ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీంతో రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు వేసుకోవాల్సిన బాధ నుంచి త్వరలోనే విముక్తి లభించనున్నదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ ట్రాన్స్డక్షన్ అండ్ టార్గెటెడ్ థెరపీ అనే నేచర్ జర్నల్లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.
సాధారణంగా పాంక్రియాస్లోని బీటా సెల్స్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది. అయితే టైప్ 1 డయాబెటిస్ రకంలో ఈ బీటా సెల్స్ తక్కువ లేదా అసలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేయవు. ఈ సమస్యకు మోనాష్ వర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనంలో ఒక పరిష్కారం పేర్కొన్నారు.
టైప్ 1 డయాబెటిస్తో మరణించిన ఓ వ్యక్తి దానం చేసిన పాంక్రియాటిక్ మూలకణాలను ఉపయోగించి, ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి వాటిని తిరిగి క్రియాశీలం చేయగలిగారు. ఇందుకు అమెరికాకు చెందిన ఫెడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం ఉన్న జీఎస్కే-123 అనే డ్రగ్ను వినియోగించారు. అయితే ఈ డ్రగ్కు డయాబెటిస్ చికిత్సకు లైసెన్స్ లేదు.
సూత్రప్రాయంగా టైప్ 1 డయాబెటిస్లో నాశనమైన ఇన్సులిన్ ఉత్పత్తి కణాలను కొత్త కణాలతో భర్తీ చేయవచ్చనే విషయం తమ అధ్యయనం చెబుతున్నదని పరిశోధకులు తెలిపారు. డయాబెటిస్ నిపుణులు, మోనాష్ వర్సిటీలో డయాబెటిస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సామ్ ఎల్ ఓస్టా, కీథ్ అల్ హసని, భారత సంతతికి చెందిన డాక్టర్ ఇషాంత్ ఖురానా నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది.