న్యూఢిల్లీ : మనం తీసుకునే ఆహార పదార్ధాలు ఏమైనా అవి మన శరీరంపై ప్రభావం చూపుతాయి. మనం తీసుకునే ఆహారంపైనే మన గుండె, మెదడు సహా శరీరంలోని కీలక అవయవాల పనితీరు ఆధారపడిఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు ఆరోగ్యంపైనా ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలి.
మెదడు పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉండేందుకు అవసరమైన ఆహార పదార్ధాలను విధిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగేందుకు దోహదపడే ఆహారంతో బ్రైన్ పవర్ ఎలా మెరుగుపరుచుకోవచ్చనే వివరాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఇన్స్టాగ్రాంలో ఓ పోస్ట్ షేర్ చేశారు. లెసిథిన్, కోలిన్ అధికంగా ఉండే ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని ఆమె సూచించారు.
గోధుమ, గుడ్డు, నట్స్, సోయాబీన్స్ వంటి ఆహార పదార్ధాల్లో లెసిథిన్ అధికంగా ఉంటుంది. ఇక అవకాడో, ఆరంజ్, డైరీ ఉత్పత్తుల్లో కోలిన్ అధికంగా ఉంటుందని ఈ ఆహారాన్ని మన మెనూల్లో చేర్చుకుని తరచూ తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు మెరుగుపరుచుకోవచ్చని అంజలి ముఖర్జీ చెప్పుకొచ్చారు. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు రాత్రివేళలో కంటినిండా నిద్ర పోవాలని, సుఖనిద్రతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు మందగించకుండా చూసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.