Milk and foods | పాలు.. మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలలో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. కాల్షియం, విటమిన్ ఏ, బీ12, రైబోఫ్లావిన్, ఫాస్పరస్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు తాగటం వల్ల మనకు మంచే జరుగుతుంది. అయితే, పాలు తాగటానికి ముందు, పాలు తగిన తర్వాత మనం తీసుకునే ఇతర ఆహారాల విషయంలోనే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొన్ని ఆహార పదార్థాలను ఇతర పదార్థాలతో మిక్స్ చేసి తీసుకోక పోవడమే ఉత్తమం. ఒకదానిలో ఒకటి ఇమడని పరిస్థితిలో కలిపి తీసుకుంటే అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, అలసట వంటి సమస్యలు రావొచ్చు. పాలు ఆరోగ్యకరమైన పానీయమే అయినప్పటికీ.. కొన్నింటితో కలిపి తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటంటే..
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్..
పాలు, ప్రోటీన్లు కలవవు. వీటి కలయిక మన శరీరం బరువు పెరిగేందుకు దోహదపడతాయంటున్నారు నిపుణులు. పాలను ప్రోటీన్ కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అయితే, వయసు పెరుగుతున్న సమయంలో కండరాల పెరుగుదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. పాలతో పాటు పెసరపప్పు, మినప పప్పు వంటివి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. పప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉండి.. జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకని పాలు తాగిన 2 గంటల తర్వాత మాత్రమే వీటిని తీసుకోవడం ఉత్తమం.
చేపలు – మాంసం..
పాలతో పాటు గుడ్లు, మాంసం, చేపలు తీసుకోవడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా మాంసంతో పాటు పాలు తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. మాంసం, చేపలు వేడి కలిగి ఉండగా.. పాలు శీతలీకరణ ప్రభావంతో ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల రసాయనాలు ఉత్పన్నమవుతాయి. పాలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల మాంసంతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు, కడుపు నొప్పి వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కలిస్తే శరీరంలో విషంగా మారే అవకాశాలు ఉంటాయి.
సిట్రస్ జాతి పండ్లు..
పాల ఉత్పత్తులను నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయలు, లీచీ వంటి సిట్రస్ పండ్లతో కలిపి తీసుకోవద్దు. పాలకు నిమ్మరసం కలవగానే జున్నుగా మారుతుంది. సిట్రస్ జాతి పండ్లను పాలతో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ పెరిగిపోతుంది. ఇది గుండెలో మంటకు దారితీస్తుంది. ఫలితంగా చర్మ అలర్జీలు, జలబు, దగ్గు వంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.
కొన్నిరకాల పండ్లు..
పనసపండ్లను తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదు. అలాగే, నువ్వులు, ఉప్పు కలిపిన ఆహారం తీసుకున్న 2 గంటల వరకు పాలు, పెరుగు తీసుకోకూడదు. ఇలా జత చేసి తీసుకోవడం వల్ల చర్మ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముల్లంగితో పాటు పాలు తీసుకుంటే అది శరీరంలో వేడిని పెంచుతుంది. జీర్ణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ఇలా చేయడం వల్ల కిడ్నీరాళ్లు, చుండ్రు, దురద, తామర, సోరియాసిస్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
అలాగే, పాలతో అరటి పండు కలుపుకుని తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది అంటువ్యాధులకు దారితీస్తుంది. క్యారెట్, చిలగడదుంప, బంగాళదుంప, నూనె, బెల్లం, తేనే, పెరుగు, కొబ్బరి, వెల్లుల్లి వంటి పదార్ధాలు తీసుకున్న వెంటనే కాని, తర్వాత కాని పాలను తాగటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.