హైదరాబాద్ : కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే రక్తనాళాల్లో వ్యర్ధాలు పేరుకుపోవడం ద్వారా రక్త ప్రసరణ తగ్గిపోతుందని దీంతో గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు అధికమవుతుందని యశోద హాస్పిటల్స్లో కన్సల్టెంట్ ఫిజిషియన్, డయబెటాలజిస్ట్ డాక్టర్ సోమ్నాధ్ గుప్తా పేర్కొన్నారు.
మంచి కొలెస్ట్రాల్ హానికారక కొలెస్ట్రాల్ను ధమనుల నుంచి తొలగించడంలో సాయపడుతుందని అన్నారు. కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకుంటే చెడుఎ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని డాక్టర్ గుప్తా చెబుతున్నారు. రెడ్ మీట్, జున్ను, బేకడ్ గూడ్స్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉండి కొలెస్ట్రాల్తో నిండిఉంటాయని అన్నారు. అధిక బరువుతోనూ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని పేర్కొన్నారు.
బాదం, వాల్నట్స్ వంటి నట్స్, సీ విటమిన్తో కూడిన పండ్లు, స్ట్రాబెర్రీస్, ద్రాక్ష, యాపిల్, ఫైబర్ అధికంగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, సోయా ఆధారిత ఫుడ్, సాల్మన్ చేపలు, కిడ్నీ బీన్స్, ఓట్స్, బార్లీ, తృణధాన్యాలను అధికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని డాక్టర్ గుప్తా వివరించారు. ఈ ఆహారంతో పాటు జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం, మద్యపానం, ధూమపానం అలవాట్లను వదిలించుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం కీలకమని చెప్పారు.