Rice | భారతీయుల ఆహార సంస్కృతిలో బియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. బియ్యంతో వండిన అన్నాన్ని చాలా మంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఎక్కువమంది బాస్మతి లేదా పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్నే ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. కానీ శతాబ్దాల క్రితమే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో స్వదేశీ బియ్యం రకాలు సాగు చేయబడేవి. వీటిలో కొన్ని సహజ సువాసనతో, మరికొన్ని ఎరుపు లేదా నలుపు రంగులతో ప్రత్యేకతను సంపాదించాయి. రుచులు, వాసనలు, పోషక విలువలు ఒక్కో రకానికి ఒక్కో విధంగా ఉండటం వీటి ప్రత్యేకత. వివిధ రాష్ట్రాల్లో పండే స్వదేశీ బియ్యం రకాల గురించి నిపుణులు వివరిస్తున్నారు. అస్సాంలో ప్రసిద్ధి చెందిన జోహా బియ్యం చిన్నగా, గుండ్రంగా ఉండే గింజలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది ఉడుకుతున్నప్పుడు ఇళ్లంతా తీయని పూల వాసనలా పరిమళిస్తుంది. వండిన తర్వాత మెత్తగా ఉండే ఈ బియ్యం అతుక్కుపోకుండా ఉంటుంది. పులావ్, పండుగల భోజనాలు, ఖీర్ వంటి తీపి వంటకాల్లో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. అస్సాంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్న ఈ బియ్యానికి జీఐ ట్యాగ్ కూడా లభించింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన గోబిందోభోగ్ బియ్యం అక్కడి సంప్రదాయాలతో ముడిపడి ఉంది. చిన్న తెల్లని గింజలతో ఉండే ఈ బియ్యం వెన్నలాంటి మృదువైన వాసనను ఇస్తుంది. ఖిచిడి, పాయేష్, పులావ్ వంటి బెంగాలీ వంటకాల్లో దీన్ని ప్రధానంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా దుర్గాపూజ సమయంలో ఈ బియ్యం లేకుండా సంప్రదాయ వంటలు పూర్తి కావని భావిస్తారు. 2017లో ఈ బియ్యానికి జీఐ గుర్తింపు లభించింది. అలాగే మణిపూర్కు చెందిన చక్-హావో అనే నల్ల బియ్యం దేశంలో అత్యంత ప్రత్యేకమైన రకాలలో ఒకటి. వండకముందు నల్లగా కనిపించే గింజలు ఉడికిన తర్వాత గాఢ ఊదా రంగులోకి మారుతాయి. కొద్దిగా తీయని, నట్స్ రుచిని కలిగిన ఈ బియ్యం పురాతన కాలంలో రాజవంశీయులకే పరిమితమై ఉండేదని చెబుతారు. చక్-హావో ఖీర్ ఈ బియ్యంతో చేసే ప్రసిద్ధ వంటకం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు కూడా దీనిని ఇష్టపడుతున్నారు.
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన మప్పిళ్లై సంబా ఎర్ర బియ్యం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. వరుడి బియ్యం అని అర్థమయ్యే ఈ రకం శక్తి, స్టామినా పెంచుతుందని నమ్మకం. గట్టిగా ఉండే ఈ బియ్యాన్ని దోశలు, ఇడ్లీలు, గంజి వంటి సంప్రదాయ వంటల్లో ఉపయోగిస్తారు. ఒకప్పుడు కనుమరుగవుతున్న ఈ రకం ఇప్పుడు ఆరోగ్యకరమైన ధాన్యాలపై పెరుగుతున్న ఆసక్తితో మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. ఉత్తరప్రదేశ్కు చెందిన కాలానమక్ బియ్యానికి బౌద్ధకాలం నాటి చరిత్ర ఉందని చెబుతారు. దీని పేరుకు కారణం గింజలపై ఉండే నలుపు రంగు పొట్టు. ఉడికినప్పుడు పాప్కార్న్ వాసనలా ప్రత్యేకమైన పరిమళం వస్తుంది. కొద్దిగా తీపి రుచితో ఉండే ఈ బియ్యం పులావ్ వంటి వంటకాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాగు తగ్గిపోవడంతో అంతరించిపోతున్న ఈ రకానికి ప్రభుత్వం జీఐ ట్యాగ్ ఇచ్చి ప్రోత్సాహం కల్పించింది.
కేరళలోని నజావర బియ్యం ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎర్రని గింజలతో ఉండే ఈ బియ్యం సాధారణ బియ్యంతో పోలిస్తే కొద్దిగా చేదు, మట్టి వాసన కలిగిన రుచిని ఇస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దీన్ని ఆయుర్వేద గంజి, ప్రత్యేక ఆహారాల్లో ఉపయోగిస్తారు. మధుమేహం, ఎముకల బలహీనత వంటి సమస్యల్లో ఇది ఉపయోగకరమని భావిస్తారు. మహారాష్ట్రకు చెందిన అంబెమోహర్ బియ్యం మామిడి పూల పరిమళాన్ని సూచిస్తుంది. వండినప్పుడు వచ్చే సువాసన మామిడి పూల వాసనను తలపిస్తుంది. మసాలే భాత్ వంటి మహారాష్ట్ర సంప్రదాయ వంటల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. జీఐ ట్యాగ్ పొందిన ఈ బియ్యం అక్కడి ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైనది. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కావుని బియ్యం కూడా ఒకప్పుడు రాజ కుటుంబాలకు మాత్రమే పరిమితమై ఉండేదని చెబుతారు. నల్లని రంగు, తీయని నట్స్ రుచి, నమిలే గుణం దీనికి ప్రత్యేకత. బెల్లం, కొబ్బరితో చేసే కావుని అరిసి స్వీట్ అనే తీపి వంటకం ఎంతో ప్రసిద్ధి చెందింది. సాధారణ బియ్యంలా తేలికగా కాకుండా గట్టిగా ఉండే ఈ బియ్యం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. దేశంలోని ఈ స్వదేశీ బియ్యం రకాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆరోగ్య జ్ఞానానికి కూడా ప్రతీకలుగా నిలుస్తున్నాయి.