నెలసరిలో బొప్పాయి, పైనాపిల్ లాంటివి తినకూడదు అంటారు. ఈ నమ్మకం శాస్త్రీయమైనదేనా? అలాగే, ఆ సమయంలో ఎలాంటి పరిశుభ్రత పాటించాలి.
మన దగ్గర నెలసరికి సంబంధించి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో స్నానం చేయకూడదని కొందరు, ఫలానావి తినకూడదని కొందరు చెబుతుంటారు. అవన్నీ అపోహలే. నిజానికి, నెలసరిలోనే మరింత శుభ్రంగా ఉండాలి. ఒకసారి కాదు, ఓపిక ఉంటే రెండుసార్లు స్నానం చేయవచ్చు. ప్యాడ్ మార్చుకునే ముందు, మార్చుకున్న తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. కనీసం ఎనిమిది గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాలి. కాబట్టి సాధారణ స్రావం అయ్యేవారు రోజులో గరిష్ఠంగా మూడు ప్యాడ్లు వాడితే సరిపోతుంది. కొందరు ప్యాడ్ పూర్తిగా తడిసిపోయే దాకా మార్చరు. ఇలా చేయడం వల్ల దాని పైపొర ఎండి పోయినట్టు అవుతుంది.
వ్యక్తిగత భాగాల్లో, తొడల దగ్గర రాపిడి జరిగే ప్రమాదం ఉంది. మరికొందరేమో మాటిమాటికీ మారుస్తూ.. రోజుకు అయిదారు దాకా ఉపయోగిస్తారు. ఇంత అతి కూడా అవసరం లేదు. పైగా ఇవి త్వరగా నేలలో కలిసిపోయేవి కూడా కాదు. దీనివల్లపర్యావరణానికీ హానికరమే. కాబట్టి, మళ్లీ మళ్లీ ఉపయోగించగల ప్యాడ్లు, మెన్స్ట్రువల్ కప్లు కూడా మంచి ఎంపికే. అయితే ఇందుకోసం ఏం వాడినా.. స్రావం ఎక్కువైనా కాకపోయినా ఏడెనిమిది గంటలు దాటాక మార్చాల్సిందే. లేకపోతే చెడువాసన వస్తుంది. బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఇక నెలసరి సమయంలో బొప్పాయి, పైనాపిల్, నువ్వులు తినకూడదని చెప్పడంలో ఎలాంటి శాస్త్రీయతా లేదు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్