పిల్లల్లో రోజురోజుకూ టైప్-2 డయాబెటిస్ కేసులు పెరుగు తున్నాయి. ఈ విషయాన్ని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. సమస్య మూలాలను వారు లోతుగా చర్చించారు.
జన్యుపరమైన కారణాల కంటే జీవనశైలి, అలవాట్లకు సంబంధించిన సమస్యలే టైప్-2 డయాబెటిస్కు మూలమని డాక్టర్ల ఆరోపణ. ఇప్పటి పిల్లలు ఇంటికంటే బయటి తిండికి ఎక్కువ అలవాటు పడిపోయారు. బడికి కూడా ఇంటి నుంచి తీసుకెళ్లడం లేదు. తల్లిదండ్రులు సైతం బ్యాగులో అన్నం డబ్బా పెట్టడానికంటే డబ్బులు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండులా.. చదువు, మార్కులు, ర్యాంకుల విషయంలో విపరీతమైన ఒత్తిడి పడుతున్నది.
ఏది ఏమైనా పసి వయసులోనే మధుమేహం బారినపడటం సమాజానికి మంచిది కాదు. కుటుంబ సభ్యులెవరికీ ఇంతకుముందు మధుమేహ చరిత్ర లేకపోతే… కొత్త తరం నుంచి అది మొదలవుతుంది. ముఖ్యంగా వ్యాధి మూలంగా ఉత్పాదక వయసైన 17 నుంచి 40 ఏండ్ల మధ్య పని సామర్థ్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి ప్రకారం వయసుతో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్ జనాభాలో 18 శాతానికి మధుమేహం ముప్పు ఉందట. ఈ అధ్యయనాన్ని బట్టి వారంతా కూడా ప్రీ డయాబెటిస్ వర్గానికి చెందుతారు. అయితే, ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నవాళ్లు మధుమేహం సమస్యాత్మకం కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందుకు జీవనశైలి మార్పులు చేసుకోవాలి.