న్యూఢిల్లీ : ఉప్పుతో తీవ్ర అనారోగ్యాల ముప్పు తప్పదని ఎంతోకాలంగా వైద్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మెదడుకు రక్తసరఫరా తగ్గితే అత్యవసర వైద్యం అందించాలని, ఏమాత్రం జాప్యం జరిగినా ప్రాణాపాయం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఈ కాంప్లికేషన్స్ను నివారించాలంటే ముందు జాగ్రత్త చర్యలు తప్పవని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైపర్టెన్షన్, స్ట్రోక్ బారినపడిన 21,000 మందిపై నిర్వహించన అధ్యయనంలో ఉప్పుకు ప్రత్యామ్నాయాలు తీసుకుంటే 14 శాతం స్ట్రోక్ ముప్పు తగ్గినట్టు గుర్తించారు.
వీరిలో గుండె జబ్బుల ముప్పు 13 శాతం తక్కువని, అకాల మరణం ముప్పు 12 శాతం తక్కువని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయన వివరాలు న్యూ ఇంగ్లండ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. రెగ్యులర్ సాల్ట్ను వాడే వారితో పోలిస్తే సాల్ట్ ప్రత్యామ్నాయాలు వాడే వారిలో స్ట్రోక్, గుండె పోటు, అకాల మరణం ముప్పు గణనీయంగా తగ్గుతుందని హార్వర్డ్ హెల్త్ కూడా ట్వీట్ చేసింది. స్ట్రోక్ను నివారించాలంటే ముందుగా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలని, ముఖ్యంగా 120/80 కన్నా తక్కువగా బీపీ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఫ్యాటీ పిష్, నట్స్, అవకాడో వంటి మోనోశాట్యురేటెడ్, పాలీఅన్శాట్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఐస్క్రీం, ఫ్రెంచ్ ఫ్రైస్, కేకుల వంటి సంతృప్త కొవ్వులకు దూరంగా ఉండాలి. మద్యపానం, స్మోకింగ్ అలవాట్లను వదిలివేయాలని, రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడే వారు విధిగా చికిత్స తీసుకోవాలి.