లండన్ : ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ప్రజలు అధిక రక్తపోటు (బీపీ)తో బాధపడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోందని, దీని దుష్ర్పభావాలను అరికట్టేందుకు ఇప్పటికైనా మనం మేలుకోవాలని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. బీపీని నిర్లక్ష్యం చేసే అది గుండె పోటు, పక్షవాతం, కిడ్నీ వ్యాధులు సహా కంటిచూపు కోల్పోవడం వంటి పలు అనర్ధాలకు దారితీస్తుందని స్పష్టం చేసింది. చిన్నపాటి జాగ్రత్తలతో అధిక రక్తపోటును నివారించవచ్చని వ్యాధి బారినపడిన వారు మెరుగ్గా నియంత్రించవచ్చని హార్వర్డ్ అధ్యయనం వెల్లడించింది.
బీపీ పరీక్షల కోసం తరచూ వైద్యుల వద్దకు వెళ్లడం కంటే ఇంటివద్దే బీపీ చెకప్ చేసుకోవడం మేలని ఈ అధ్యయనం పేర్కొంది. ఇంటివద్దే బీపీ పరీక్షించుకునేవారిలో ఇతరులతో పోలిస్తే 72 శాతం మంది తమ రక్తపోటును అదుపులో ఉంచుకుంటున్నారని హార్వర్డ్ అధ్యయనం వెల్లడించింది. ఇక రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తే బీపీ 10 పాయింట్ల వరకూ తగ్గుతుందని పేర్కొంది.
శారీరక వ్యాయామంతో బీపీ తగ్గడంతో పాటు బరువును అదుపులో ఉంచి గుండెను బలోపేతం చేయడం, ఒత్తిడి తగ్గించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక సరైన సమతులాహారం తీసుకోవడం, ఆల్కహాల్, స్మోకింగ్కు దూరమవడం, ఉప్పును మితంగా తీసుకోవడం, రోజుకు కనీసం ఆరుగంటలు నిద్రించడం, ఒత్తిడికి లోనుకాకుండా ఉండటం వంటి జాగ్రత్తలతో అధిక రక్తపోటును నివారించడం లేదా నియంత్రించడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి.