ఒకే దగ్గర బద్ధకంగా కూర్చోవడం కంటే పడుకోవడమే మేలని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’లో ప్రచురితమైన ఈ పరిశీలన ప్రకారం.. ఒకే దగ్గర కూర్చొని గుండె జబ్బులు, మధుమేహం తెచ్చుకునే కంటే హాయిగా పడుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చట. కానీ, ఓ మోస్తరు నుంచి కఠినమైన వ్యాయామాలు చేయకుండా.. కేవలం పడుకుని ఉండటం మాత్రం అంత మంచిది కాదట. బద్ధకాన్ని వదిలించుకుని శారీరక శ్రమతో రోగాలను దూరం చేసుకోవచ్చని ఈ అధ్యయనం సూచించింది.
మూడు నుంచి పదేండ్ల పిల్లల్లో పాచి, చిగుళ్ల వ్యాధులను తగ్గించడానికి మామూలు బ్రష్ కంటే ఎలక్ట్రిక్ టూత్బ్రష్లు గొప్పగా పనిచేస్తాయట. పండ్లలో పేరుకున్న పాచి, చిగుళ్ల వాపు సమస్య జింజివైటిస్ను ఎలక్ట్రిక్ టూత్బ్రష్లు మామూలు వాటికంటే 75 శాతం ఎక్కువ సమర్థంగా శుభ్రపరుస్తాయట. ఈ పనితనం ఏడు నుంచి పదేండ్ల పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంటుందట. పండ్లలో ఎక్కువ మొత్తంలో పేరుకుపోయిన పాచి.. పిల్లల్లో పుచ్చుపండ్లకు (కేవిటీస్) దారితీస్తుందని వివిధ అధ్యయనాల్లో తేలింది.
సమతులాహారం తీసుకోవడం, వ్యాయామం, పొగ తాగకపోవడం, తగినంత నిద్ర తదితర మంచి అలవాట్లు ఉన్న కౌమార వయస్కుల్లో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండే అవకాశం ఉందట. గుండె ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఏకాగ్రత, ప్రణాళిక, సమస్యల పరిష్కారం, మల్టీ టాస్కింగ్ లాంటివాటిలో ముందున్నారని ఒక అధ్యయనం తెలిపింది. అమెరికాలోని 21 నగరాలకు చెందిన పిల్లల మీద ఈ పరిశోధన జరిగింది. అయితే పిల్లల్లో ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నట్టయితే చిన్నపిల్లల వైద్యులు (పీడియాట్రిషియన్లు) వారి మెదడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలని పరిశోధకులు సూచించారు.
ఎక్కడ అనేదానితో సంబంధం లేకుండా వ్యాయామంతో మన మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అదే ఆహ్లాదకరమైన పరిసరాల్లో అయితే.. వ్యాయామం మెదడుకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుందట. యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా విద్యార్థులు ఈ విషయంపై అధ్యయనం చేశారు. రోజుకు పావుగంట వంతున ఓ రోజు తమ గదుల్లో, ఇంకోరోజు పచ్చని ఆరుబయట నడిచారు. ఆరుబయట నడకతో తమ మెదడు చురుగ్గా పనిచేసిందని గ్రహించారు. మీరు కూడా ఉదయపు నడక ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఉండేలా చూసుకోండి.