సహజంగా పక్వానికి వచ్చే మామిడి పండ్ల కంటే కృత్రిమ పద్ధతుల్లో పండించిన పండ్ల బరువు ఎక్కువ. కాబట్టే, కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు నీళ్లలో మునుగుతాయి. సహజంగా పండినవి మాత్రం పైకి తేలతాయి. ఈ నియమం కొన్ని జాతుల మామిడి పండ్లకు వర్తించకపోవచ్చు. రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తినడం వల్ల కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు తదితర సమస్యలు ఎదురుకావచ్చు. ప్రత్యేకించి రక్తనాళాలపై కార్బైడ్ ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆ విషయాన్ని గుర్తించక.. మామిడి పండ్లు తినడం వల్ల వేడి చేసిందని అనుకుంటారు. కార్బైడ్ ప్రభావంతో ఎసిడిటీ, అజీర్తి ఇబ్బంది పెడతాయి. సెగ గడ్డలు ఏర్పడతాయి.
మన జీర్ణ వ్యవస్థ ఆ రోజు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు మాత్రమే సిద్ధంగా ఉంటుంది. కానీ, సీజన్లో బుట్టలకొద్దీ లాగిస్తారు కొంతమంది. దీంతో సమస్యలు ఎదురవుతాయి. అరుదుగా.. మూత్రంలో మంట అనిపించవచ్చు. మలంలో రక్తం పడవచ్చు. కళ్లు ఎర్రబడవచ్చు. ఒక ఇంట్లో అందరూ అవే మామిడి పండ్లు తిన్నా కొందరికే ఈ సమస్య రావచ్చు.
వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిపై కార్బైడ్ మాలిన్యాలు, పాడైపోయిన మామిడి పండ్లలోని విషకారకాలు తీవ్ర ప్రభావం చూపలేవు. కానీ, తక్కువ వ్యాధి నిరోధక శక్తి ఉన్నవాళ్లు మాత్రం ఇట్టే అనారోగ్యం పాలవుతారు. సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు 200 గ్రా. పండు లేదా 100 గ్రా. గుజ్జు తీసుకుంటే సరిపోతుంది.నేస్తమా..
– డాక్టర్ చిలువేరు రవీందర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, వరంగల్