గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్).. తీవ్రత గతంలో పరిమితంగా ఉండేది.అనేకానేక కారణాలతో ఈ వ్యాధి పీడితుల సంఖ్య పెరుగుతున్నది.అన్ని వయసుల వారినీ మహమ్మారి కబళిస్తున్నది. ఈ రుగ్మత లక్షణాలను ఓ పట్టాన అర్థం చేసుకోలేం. రోగి పైపైకి ఆరోగ్యంగానే ఉంటాడు. వైద్య పరీక్షల ఫలితాలు సాధారణంగానే కనిపిస్తాయి. కానీ ్రక్రమంగా బలహీనపడతాడు. ఓ దశలో అచేతనంగా మారిపోతాడు. కాళ్లు, చేతులు, మెడ కండరాలతో పాటు..ఒకోసారి తలలోని కండరాలూ చైతన్యాన్ని కోల్పోతాయి. రెప్పవాల్చలేని దుస్థితికి చేరతాడు. కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
సాధారణంగా రుతువు మారినప్పుడు.. అంటే, చలికాలం నుంచి ఎండాకాలానికి, ఎండాకాలం నుంచి వర్షాకాలానికి.. సరిగ్గా రుతువు మారిన సమయంలో గులియన్ బారె సిండ్రోమ్ వచ్చే ఆస్కారం ఎక్కువ. నిజానికి ఇది ఎప్పుడైనా రావచ్చు. కానీ సీజన్ మారినప్పుడు ఆ తీవ్రత మరింత అధికం అవుతుంది. జీబీఎస్ నేరుగా రోగి నరాలపై ప్రభావం చూపుతుంది. నరాలు మన శరీరంలోని వివిధ అవయవాలకు మధ్య విద్యుత్ తీగల్లా పనిచేస్తాయి. కనెక్టివిటీ ఇస్తాయి. ఎప్పుడైతే ఈ నరాలు దెబ్బతింటాయో.. విద్యుత్ ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా అవయవాలు మొరాయిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీబీఎస్ అనేది ఒక రకమైన నరాల వ్యాధి. మనిషిలోని ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంది. మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకూ నరాల ద్వారా సమాచారం అందుతూ ఉంటుంది. దీనివల్లనే పరిస్థితులకు అనుగుణంగా కాళ్లు, చేతులతో పాటు అన్ని అవయవాలనూ మనం కదిలించగలుగుతాం. అయితే ఈ నరాలన్నిటిపైనా ‘మైలిన్’ అనే పొర ఉంటుంది. ఈ పొర ద్వారానే కదలికల సమాచారం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా వెళ్తూ వస్తూ ఉంటుంది. ఆ సిగ్నళ్ల ఆధారంగానే.. కండరాలు కదులుతాయి. కానీ, మైలిన్ పొర దెబ్బతిన్నప్పుడు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ నిలిచిపోతాయి. ఫలితంగా నరాలు దెబ్బతిని అవయవాలు పనిచేయడం మానేస్తాయి.
వైరస్ దాడి చేస్తే
జీబీఎస్.. ప్రాథమికంగా ఆటో ఇమ్యూన్ వ్యాధి. సాధారణంగా ప్రతి వైరస్ చుట్టూ ప్రొటీన్స్ ఉంటాయి. ఏదైనా వైరస్ రోగి శరీరంలోకి ప్రవేశించినప్పుడు, శరీరంలోని నిరోధక శక్తి ..వైరస్పై ఉండే ప్రొటీన్స్పై దాడిచేసి, ఆ వైరస్ను కూడా చంపేస్తాయి. ఈ క్రమంలో రోగి వ్యాధి నిరోధకత.. శరీరంలోని నరాలపై ఉండే ప్రొటీన్స్ను వైరస్కు సంబంధించిన శత్రు ప్రొటీన్స్గా భావించి వాటిపై దాడిచేస్తుంది. దీనివల్ల నరాలపై ఉండే ‘మైలిన్’ పొర నాశనం అవుతుంది. దాంతో ఎలక్ట్రిక్ సిగ్నళ్ల ప్రసరణకు అంతరాయం ఏర్పడి, కండరాలు కదలికలను కోల్పోతాయి. రోగి అచేతనంగా మారిపోతాడు. కొన్నిచోట్ల నరాలపై మైలిన్ పొర ఉండనే ఉండదు. దీంతో ఇమ్యూన్ వ్యవస్థ దాడివల్ల వివిధ రకాల జీబీఎస్ రుగ్మతలు చుట్టుముడతాయి.
వ్యాధి తీవ్రత ఇలా..
మైలిన్ పొర దెబ్బతినడంతో తొలి దశలో పొడవైన నరాలన్నీ పనిచేయడం మానేస్తాయి. అందుకనే, ఈ రుగ్మత వచ్చిన వెంటనే మెదడు నుంచి కాళ్ల వరకు ఉండే కాలి నరాలు ప్రభావితం అవుతాయి. ఫలితంగా కాళ్లు చచ్చుబడిపోతాయి. ఆ తర్వాత వ్యాధి క్రమంగా పైవైపు పాకుతున్నట్టు కనిపిస్తుంది. అంటే… వీపు, చేతులు, మెడ కండరాలు, ఆ తర్వాత చివరగా ముఖ కండరాలు. ఇలా రోగి శరీరం మొత్తం అచేతనమైపోతుంది. రెండుకాళ్లూ, రెండుచేతులూ చచ్చుబడినట్టు అవుతాయి. అయినా రోగిలోని ప్రధాన అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తుంటాయి. వ్యాధిని మరింత నిర్లక్ష్యం చేస్తే ఛాతీ కండరాలు, ఊపిరి తిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాలు కూడా ప్రభావితం అవుతాయి. దాంతో ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. సరిగ్గా శ్వాస తీసుకోకపోతే రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. అప్పుడు, వెంటిలేటర్ అవసరం అవుతుంది. దీంతోపాటు గొంతు కండరాలు సైతం ప్రభావితం అవుతాయి. మాట్లాడటం, మింగడం కష్టమవుతుంది. రోగి చాలా ఇబ్బంది పడతాడు. నరకాన్ని అనుభవిస్తాడు.
ఎక్కువగా వీరిలోనే…
జీబీఎస్ అన్ని వయసుల వారినీ వేధిస్తుంది. కానీ ఎక్కువగా 30-45 ఏండ్ల లోపు వారికి, 50-65 ఏండ్ల లోపు వారిని లక్ష్యంగా పెట్టుకుంటుంది. డయేరియా, శ్వాసకోశ ఇన్ ఫెక్షన్స్కు గురైనప్పుడు.. సమస్య వచ్చిపోయిన రెండు నుంచి నాలుగు వారాల తరువాత జీబీఎస్ దాడిచేసే అవకాశాలు ఉంటాయి. మహిళలతో పోలిస్తే పురుషుల్లో సమస్య కొంత ఎక్కువగా ఉంటుంది. మగవాళ్లు ఎక్కువగా బయట తిరగడం, తరచూ ఇన్ఫెక్షన్లకు గురి కావడమే దీనికి కారణమంటారు నిపుణులు.
నిర్ధారణ-చికిత్స
నర్వ్ కండక్షన్ స్టడీస్ పద్ధతిలో నరాలకు కరెంటు ఇచ్చి, కండరాల ప్రతిస్పందనను రికార్డు చేస్తారు. ఈ పరీక్ష ద్వారా నరాల పనితీరు తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ పద్ధతి సమస్యను సరిగ్గా నిర్ధారించలేదు. దీంతో, లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా.. రోగి బరువు ఆధారంగా ఔషధం మోతాదు నిర్ణయించి.. ఐదు రోజుల పాటు ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి శరీరంలోని యాంటీబాడీస్ మనకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని అడ్డుకుంటాయి. అలా యాంటీబాడీస్ను బ్లాక్ చేస్తాయి. తద్వారా నరాలపై ఉండే మైలిన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. ప్లాస్మా ఎక్సేంజ్ చికిత్సలో అయితే.. రోగి బరువును బట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎమ్ఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా జరుగుతుంది. నాలుగు నుంచి ఆరు విడతలుగా చికిత్స చేయాల్సి ఉంటుంది. తొలగించిన ప్లాస్మాకు బదులు స్లైన్, ఆల్బుమిన్ భర్తీ చేస్తారు. కాకపోతే, ఇమ్యునోగ్లోబ్యులిన్ చికిత్స ఖరీదైంది. దాంతో పోలిస్తే ప్లాస్మా ఎక్సేంజ్ .. దాదాపు సగం ఖర్చులోనే పూర్తవుతుంది. అయితే అప్పటికే అచేతనమైన శరీర భాగాలు వెంటనే పనిచేయడం ప్రారంభించవు. పూర్తిగా మెరుగుపడతాయనీ చెప్పలేం. కాకపోతే, చికిత్స తీసుకోని రోగితో పోలిస్తే చికిత్స తీసుకున్న రోగిలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
లక్షణాలు
చికిత్స పద్ధతులు
స్వల్ప లక్షణాలు ఉంటే కనుక.. జబ్బు తీవ్రత పెరుగుతున్నదా, లేదా అన్నది గమనిస్తారు. ఇతరులపై ఆధారపడకుండా రోగి తన పనులు తాను చేసుకోగలిగేలా మందులిస్తారు. తీవ్ర లక్షణాలు ఉన్నప్పుడు.. అంటే రోగి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రం వివిధ పద్ధతుల్లో చికిత్స చేస్తారు. ఎంత త్వరగా చికిత్స అందితే అంత మంచిది. రోగి అంత వేగంగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. చాలా మంది రోగులు మూడు నెలల్లోపు కోలుకుంటారు. మరి కొందరికి ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది. ఇంకొందరు, ఎప్పటికీ పూర్తిగా కోలుకోలేక పోవచ్చు కూడా.
సీఎస్ఎఫ్ పరీక్ష
తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి.. పొటాషియం, క్యాల్షియం స్థాయులను, క్రియాటినిన్ స్థాయిని పరిశీలిస్తారు. అంతా సక్రమంగా ఉంటే నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్ష వ్యాధి తీవ్రతను కచ్చితంగా చెప్పలేదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్ ఎఫ్) పరీక్ష చేయాల్సిన అవసరం రావచ్చు.
అనర్థాలు
…?మహేశ్వర్రావు బండారి
డాక్టర్ ఎం. నిహారిక
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్