కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ రోగులు వేసవికాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాఫీ టీలు, మసాలాలు, పులుపు పదార్థాలకు దూరంగా ఉండాలి. వడదెబ్బ కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి క్యాన్సర్ తిరగబెట్టే ఆస్కారమూ ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు క్యాన్సర్ రోగులు బయట తిరగక పోవడమే మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ముఖానికి, చేతులకు ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్)-30 ఉన్న సన్స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. గొడుగు, చలువ కళ్లద్దాలు వాడాలి. కీమోథెరపీ లేదా రేడియేషన్ ప్రభావంతో జుట్టు రాలిన రోగులు.. విగ్గు ధరించడం కన్నా చల్లని నూలు రుమాలు తలకు చుట్టుకోవడం మంచిది. కొన్ని రకాల కీమోథెరపీ మందుల వల్ల చర్మం చాలా సున్నితంగా మారే ప్రమాదమూ ఉంది.
శరీరానికి నీటి కొరత
ఎండాకాలంలో శరీరంలోని నీటి మోతాదు తగ్గుతుంది. కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వల్ల మరింత ఆహారం, నీరు తీసుకోవాలనిపిస్తుంది. వాంతులు, విరేచనాల దెబ్బకు
శరీరంలో నీటిశాతం భారీగా తగ్గిపోతుంది. దీనిని అధిగమించడానికి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. అదనంగా ఇంట్లో తయారు చేసుకున్న పండ్ల రసాలు, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
తేలికైన వ్యాయామాలు
ఈత కొలనులో వాడే రసాయనాలు క్యాన్సర్ రోగులకు హానిచేస్తాయి. అందువల్ల కీమో లేదా రేడియేషన్ తీసుకునేవారు ఈతకు వెళ్లకపోవడమే మంచిది. వ్యాయామం శరీరానికి మంచిదే కానీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు వేసవిలో కఠినమైన కసరత్తులు చేయకూడదు.
రకరకాల సమస్యలు
నీరసం, కండరాలు పట్టేయడం, తలనొప్పి, సత్తువ తగ్గడం, వాంతులు, పసుపు వర్ణంలో మూత్రం, తీవ్రమైన చెమటలు, స్పృహ తప్పడం.. ఇలాంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే రోగికి మంచి నీళ్లు ఇవ్వాలి. చల్లని గదిలో పడక ఏర్పాటుచేయాలి. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. కీమోథెరపీ తీసుకుంటున్న పసిబిడ్డలైతే.. తరుచూ తల్లిపాలు, ఓఆర్ఎస్ ఇవ్వాలి. వివిధ ప్రతికూల ప్రభావాల నుంచి తల్లిపాలే పిల్లలను రక్షిస్తాయి.
డాక్టర్ స్వప్న జిల్లా
సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్
మల్లారెడ్డి క్యాన్సర్ ఆసుపత్రి