న్యూఢిల్లీ : మధుమేహ నియంత్రణలో ఆరోగ్యకర ఆహారం మెరుగైన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. సూక్ష్మపోషకాలతో నిండిన ఆహారంతో మధుమేహాన్ని నియంత్రించవచ్చని కార్బోహైడ్రేట్ల కంటే ప్రొటీన్లు అధికంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుండగా ఆహారాన్ని క్రమ పద్ధతిలో తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి.
ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకుంటే తీపిపదార్ధాలు తీసుకున్నా బ్లడ్ షుగర్ స్ధాయిలు పెరగవని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ముందుగా కూరగాయలతో ఆహారం తీసుకుని షుగర్తో ముగించడం మేలని ఇలా తింటే బ్లడ్ షుగర్ పెరగడాన్ని 75 శాతం నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా పలువురికి రకరకాల ఆహార పదార్ధాలను మూడు రోజుల పాటు అందించారు. ఆపై వారికి పరీక్షలు నిర్వహించగా తొలుత ప్రొటీన్లు, కూరగాయలు తీసుకున్నవారిలో ముందుగా కార్బోహైడ్రేట్లు తీసుకున్న వారితో పోలిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ 38 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
తీసుకునే ఆహారంలో, మోతాదులో ఎలాంటి మార్పులు చేయకుండానే కేవలం ఆహార పదార్ధాలు తీసుకునే క్రమ పద్ధతిని మార్చడం ద్వారా ఈ వ్యత్యాసం గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా కూరగాయలతో మీల్స్ ప్రారంభించి ఆపై గుడ్డు, చికెన్, ఫిష్ వంటి ప్రొటీన్లు తీసుకోవాలని, ఆపై అవకాడోలు, నట్స్ వంటి కొవ్వులు, ఆ తర్వాత ఆలూ, పాస్తా వంటి కార్బోహైడ్రేట్లు చివరిగా చాక్లెట్లు, కుకీస్ వంటి షుగర్తో భోజనం ముగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహ రోగులు ఈ పద్ధతిలో ఆహారం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.