Retinopathy of Prematurity | పుట్టగానే కేర్కేర్ అంటూ ఏడ్చేస్తారు. అమ్మపాలు తాగుతూ ఆదమరిచిపోతారు. కేరింతలు కొడుతూ కనువిందు చేస్తారు. కానీ, చాపకింద నీరులా ఓ తీవ్ర సమస్య విస్తరిస్తూపోతుంది. రుగ్మత లక్షణాలనుగుర్తించి.. నేత్ర వైద్యుల ద్వారా చికిత్స అందిస్తే గండం గట్టెక్కినట్టే. లేకపోతే.. శాశ్వత అంధత్వం ఖాయం. రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ.. నవజాత శిశువుల పాలిట మహమ్మారే.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.. అంటారు పెద్దలు. శరీరంలోని అన్ని ఇంద్రియాల్లోకి నేత్రాలే కీలకం. కాళ్లూచేతులు లేకపోయినా సరే, కృత్రిమ అవయవాలతో జీవించవచ్చు. కానీ కంటిచూపు లేకపోతే.. ప్రపంచాన్ని చూడలేం. బతుకంతా అంధకారమే. అందుకే, దృష్టి జ్ఞానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేత్ర సమస్యలు రకరకాలుగా ఎదురవుతాయి. కొందరికి పుట్టుకతోనే చూపు ఉండదు. మరికొందరికి పుట్టుకతో ఉన్నా.. నేత్ర వ్యవస్థ సమగ్రంగా వృద్ధి చెందకపోవడం వల్ల క్రమంగా చూపు కోల్పోతారు.
ఓ దశలో శాశ్వత అంధత్వం వచ్చేస్తుంది. దీన్నే ఆర్ఓపీ (రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ) అంటారు. ఇలాంటి శిశువుల విషయంలో సమస్యను సకాలంలో గుర్తించి, చికిత్స అందించగలిగితే.. అంధత్వం నుంచి కాపాడవచ్చు. కానీ ఇక్కడో సమస్య ఉంది. ఆర్ఓపీతో జన్మించే పిల్లలు బయటికి బాగానే కనిపిస్తారు. రోజులు గడిచేకొద్దీ అంధత్వం పంజా విసురుతుంది. మన దేశంలో తొలి ఆర్ఓపీ కేసు 1991లో నమోదైంది. కానీ అమెరికాలో 1941లోనే గుర్తించారు.
సాధారణంగా నాలుగో వారం నుంచే గర్భస్థ శిశువులో వివిధ అవయవాలు వృద్ధి చెందడం ఆరంభం అవుతుంది. నేత్రాల విషయానికొస్తే.. పదహారో వారంలో రెటీనా తొలి ఆకృతి దాలుస్తుంది. బాహ్యంగా కనిపించే కన్ను మాత్రం, అన్ని అవయవాలతో పాటుగానే రూపొందుతుంది. మొత్తానికి, ప్రసవానికి ముందు చివరి రెండు వారాల్లో రెటీనా సిద్ధం అవుతుంది. అంటే, 38 నుంచి 40 వారాల మధ్య పరిపూర్ణతను సంతరించుకుంటుంది. రెటీనా వృద్ధి చెందకపోతే చూపు ఉండదు. కాబట్టే, 38 వారాల కంటే ముందు జన్మించిన పిల్లల్లో.. అంటే నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో రెటీనా తగినంతగా వృద్ధి చెందదు. రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ(ఆర్ఓపీ) డిసీజ్కు ఇదే మూల కారణం.
నెలలు నిండకుండానే, అదీ తక్కువ బరువుతో జన్మించే పిల్లల్లో ఆర్ఓపీ సమస్య అధికంగా ఉంటుంది. నెలలు నిండకుండా పుట్టిన 100 మంది పిల్లల్ని పరిశీలించినప్పుడు.. అందులో కనీసం 50మందికి ఆర్ఓపీ సమస్య ఉందని తేలింది. ఆ పసిబిడ్డల్లో రెటీనా పూర్తిస్థాయిలో వృద్ధిచెందక పోవడమే దీనికి ప్రధాన కారణం. శిశువు శరీరంలో లోపాలు ఉంటే.. సాధారణ వైద్య పరీక్షలో వెల్లడి అవుతుంది. అనారోగ్యాలు ఇబ్బంది పెడుతున్నా లక్షణాలను బట్టి తెలిసిపోతుంది. వెంటనే చికిత్స అందించవచ్చు. తప్పనిసరైతే శస్త్ర చికిత్సకూ ఏర్పాట్లు చేసుకోవచ్చు. కానీ ఆర్ఓపీ సమస్య అలా కాదే! బయటికి కనిపించదు. అభంశుభం తెలియని శిశువూ చెప్పలేదు. అలా, చాపకింద నీరులా విస్తరించిపోతుంది. ఆ పసికందులు కూడా పైపైకి సాధారణ పిల్లల్లానే కనిపిస్తారు. ఆరోగ్యంగా ఉన్నట్టు అని పిస్తారు. రుగ్మతను సకాలంలో గుర్తించి, చికిత్స అందించకపోతే మాత్రం కంటి చూపు పోతుంది. అందుకే దీన్ని ‘ఎమర్జెన్సీ డిసీజ్’గా పరిగణిస్తారు. కాబట్టే, జన్మించిన వెంటనే ప్రతి శిశువుకూ కంటి పరీక్షలు జరపాలి. ఆర్ఓపీపై అవగాహన ఉన్న వైద్యులనే బాధ్యులుగా నియమించాలి. లేదంటే, ఆ సౌకర్యాలున్న కంటి దవాఖానకైనా సిఫారసు చేయాలి.
ఇక్కడ ప్రతిక్షణం విలువైనదే. ప్రతి రోజూ కీలకమైనదే. కౌంట్ డౌన్.. 30, 29, 28, 27 ఇలా సాగిపోతుంది. ఒకటి దగ్గరికి వచ్చేసరికి.. అంధత్వానికి అడుగుదూరంలో ఉన్నట్టే. శిశువు జన్మించిన నెల రోజుల్లోనే.. సమస్యను గుర్తించి సరైన చికిత్స అందించకపోతే.. మూడు నాలుగు నెలల్లోనే కంటిచూపు శాశ్వతంగా మసకబారుతుంది. జీవితాంతం అంధత్వంతో బాధపడక తప్పదు. కాబట్టి, ఎంత త్వరగా చికిత్స అందిస్తే అంత మంచిది. ఎంత ఆలస్యం చేస్తే సమస్య అంత జటిలమూ కావచ్చు. ఆర్ఓపీ ప్రభావం పెరిగిపోయి చూపు దెబ్బతింటుంది. నిజానికి, నెలలు నిండకుండా జన్మించే శిశువుల కళ్లు కూడా ప్రపంచాన్ని చూడటానికి సిద్ధంగా ఉంటాయి. సకాలంలో చికిత్స అందిస్తే సమస్యను 90 నుంచి 95 శాతం మేర అధిగమించవచ్చు. సాధారణ దృష్టిని అందించవచ్చు.
ఆర్ఓపీ సమస్యతో జన్మించిన శిశువు విషయంలో ముందుగా జరగాల్సింది.. ఇన్ఫెక్షన్ కంట్రోల్. వ్యాధి దుష్ప్రభావం కంటి భాగమంతా విస్తరించకుండా చూడాలి. అందులోనూ, తల్లి పురుడుపోసుకునే దవాఖానలో నర్సింగ్ కేర్ చాలా కీలకం. రెండోది ఆక్సిజన్. సాధారణంగా.. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ అవసరం అవుతుంది. అయితే, ఇందుకు ప్రత్యేకమైన పాలసీ ఉంది. ఆ ప్రకారంగా.. స్వచ్ఛమైన ఆక్సిజన్ను నేరుగా ఇవ్వకూడదు. గాలితో కలిపి మాత్రమే అందించాలి. ఆ విషయం తెలియకో, తెలిసీ నిర్లిప్తతతోనో వ్యవహరిస్తే ప్రాణాంతకమే. ఆర్ఓపీ బాధిత పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు తగ్గకుండా జాగ్రత్త పడాలి. సరైన పోషకాలు అందించాలి. ఆ దశలో తల్లిపాలు ఔషధంలా పనిచేస్తాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి చనుబాలు పట్టాలి. రక్తహీనత, బరువు తగ్గడం వంటి సమస్యల వల్ల ఆర్ఓపీ ప్రభావం పెరిగిపోయి.. కంటి చూపు దెబ్బతింటుంది.
కంటి వైద్యులు అందుబాటులో ఉన్న ప్రసూతి దవాఖానలోనే డెలివరీ జరిగితే మేలు. అమెరికా వంటి దేశాల్లో ప్రసూతి వైద్యశాలలో కంటి వైద్యులు తప్పనిసరిగా ఉంటారు. ఆ మేరకు చట్టం కూడా చేశారక్కడ. శిశువు జన్మించిన వెంటనే కంటి పరీక్షలు జరపాలి. అది కనుక ఆర్ఓపీ అని తేలితే వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. సరైన నర్సింగ్ కేర్ చాలా అవసరం. శుభ్రమైన చేతులతోనే శిశువును తాకాలి. ఆక్సిజన్ అవసరమైనప్పుడు సరైన మోతాదులో ఇవ్వాలి. మోతాదు తగ్గితే శిశువు మరణిస్తుంది. మోతాదు పెరిగితే కళ్లు దెబ్బతింటాయి. క్రమం తప్పక కంటి పరీక్షలు చేయించాలి. అదే సమయంలో తల్లి ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్ఓపీ బాధిత శిశువులకు సకాలంలో సమర్థవంతమైన చికిత్స కీలకం. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కంటి పరీక్షలు నిర్వహించాలి. లేజర్ చికిత్స లేదా ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత ఆధారంగా లేజర్, ఇంజక్షన్ రెండూ తప్పకపోవచ్చు. ఆర్ఓపీ తీవ్రత తెలుసుకునేందుకు ‘ఫోరస్ నియోనాటల్ కెమెరా’ను ఉపయోగించి శిశువు కంట్లోని రెటీనాను ఫొటో తీస్తారు. పెద్దవారి రెటీనాను ఫొటో తీసే అట్లాస్ ఆఫ్ ఆర్ఓపీ ఫ్లోర్సైన్ కెమెరాతో కూడా శిశువుల రెటీనాను ఫొటో తీయవచ్చు. ఈ పరిజ్ఞానాన్ని ప్రపంచంలోనే తొలిసారిగా ఎల్వీ ప్రసాద్ కంటిదవాఖాన అందుబాటులోకి తెచ్చింది. ఇది మనం గర్వించాల్సిన విషయం. ఈ సేవను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి.
– డాక్టర్ సుభద్ర జలాలీ డైరెక్టర్, న్యూబార్న్ ఐ హెల్త్ అలయన్స్ నెట్వర్క్ ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ
…?మహేశ్వర్రావు బండారి