న్యూఢిల్లీ : భారత్లో 80 శాతం మందికి పైగా సూక్ష్మపోషకాల లోపంతో బాధపడుతున్నారని, ఫలితంగా వ్యాధినిరోధకత లోపిస్తోందని బేయర్ కన్జూమర్ హెల్త్ డివిజన్ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా సూక్ష్మపోషకాల లోపంతో బాధపడుతుంటే వారిలో సగం మంది భారత్లో నివసిస్తున్న వారేనని డాక్టర్స్ కన్సెన్సస్ పేపర్ వెల్లడించింది. మనలో ఎక్కువ మంది ఈ సమస్య బారినపడుతుండటం ఆందోళనకరమని బేయర్ కన్జూమర్ హెల్త్ డివిజన్ కంట్రీ హెడ్ సందీప్ వర్మ పేర్కొన్నారు.
పలు సూక్ష్మపోషకాలను తగినంత తీసుకోకపోవడంతో పాటు అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణాలు భారత్లో సూక్ష్మపోషకాల లోపం పెరుగుతున్నదని వర్మ అన్నారు. తీవ్రమైన అలసట, నిస్సత్తువ, ఆకలి లేకపోవడం వంటివి ఈ సమస్యకు తొలి సంకేతాలని 21 మంది భారత వైద్యులతో కూడిన జాతీయ సలహా మండలి నివేదిక ఆధారంగా కన్సెన్సస్ వెల్లడించింది. సూక్ష్మపోషకాల లేమితో ప్రజల్లో ఇమ్యూనిటీ తగ్గుతున్నదని పేర్కొంది.
గర్భిణి స్త్రీలు అత్యవసరంగా తీసుకోవాల్సిన సూక్ష్మపోషకాలను 50 శాతం తక్కువగా తీసుకుంటున్నారని తెలిపింది. సరైన ఆహార అలవాట్లు కొరవడటం, తగినంత ఆహారం తీసుకోకపోవడం ఫలితంగా పట్ఠణ ప్రాంతాల్లో 62 శాతం మంది సూక్ష్మ పోషకాల లేమితో బాధపడుతున్నరని నివేదిక పేర్కొంది.
ఈ సూక్ష్మ పోషకాల లోపంతో వ్యాధినిరోధకత ఎలా కుంగుతుందనేది వైద్య నిపుణులు విస్పష్టంగా వివరించారు. జింక్, విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ ఇమ్యూనిటీని పెంపొందించే కీలక సూక్ష్మ పోషకాలని ఇవి వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ముప్పును నివారిస్తాయనేందుకు శాస్త్రీయ ఆధారాలు లభించాయి.