న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ను తగ్గించేందుకు అత్యున్నత స్ధాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి.
వ్యాక్సినేషన్పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా మండలి(ఎన్టీఏజీఐ)తో ఈ దిశగా తదుపరి చర్చలు జరుగుతాయని తెలిపాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన సర్ గంగారాం హాస్పిటల్ చేపట్టిన సర్వేలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోసుతో వ్యాధి లక్షణాల నుంచి తీవ్రత నుంచి సరైన రక్షణ లభించడం లేదని వెల్లడి కావడంతో ఈ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం తగ్గించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దవాఖానకు చెందిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా 4700 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు.