ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఎంత వ్యాయామం చేశాం అన్నది కాదు.. ఎలాంటి వ్యాయామాలు చేశాం అన్నదీ ముఖ్యమే అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ ఒకే వ్యాయామం చేస్తే సరిపోతుంది అనే అభిప్రాయాన్ని ఈ పరిశోధనలు తప్పుబడుతున్నాయి. శరీరాన్ని ఒకే విధంగా కాకుండా విభిన్నంగా కదిలించడం వల్ల గుండె నుంచి మెదడు వరకు అన్ని అవయవాలు చురుకుగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముఖ్యంగా మిక్స్డ్ వ్యాయామాలు చేసే వారిలో ఆయుష్షు పెరగడం, ఒత్తిడి తగ్గడం, ఇమ్యూనిటీ మెరుగుపడటం లాంటి ప్రయోజనాలు కనిపించాయని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన ఈ పరిశోధనలో 1,11,000 మందికి పైగా వ్యక్తుల ఆరోగ్య, వ్యాయామ అలవాట్లను 30 సంవత్సరాలకు పైగా పరిశీలించారు.
ఇందులో ఒకే రకమైన వ్యాయామం చేసే వారితో పోలిస్తే, విభిన్న రకాల వర్కవుట్లు చేసే వారిలో ముందస్తు మరణాల ప్రమాదం 19% వరకు తక్కువగా కనిపించింది. గుండె జబ్బుల వల్ల మరణాల ప్రమాదం 22% తగ్గింది. క్యాన్సర్ కారణంగా మరణించే ప్రమాదం 15% వరకు తక్కువగా కనిపించింది.
ఒకే వ్యాయామాన్ని ప్రతిరోజూ చేయడం కాకుండా వివిధ రకాల శారీరక చలనాలను కలిపి చేయడమే మిక్స్డ్ ఎక్సర్సైజ్. ఉదాహరణకు… వాకింగ్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, సైక్లింగ్, మెట్లు ఎక్కడం, గార్డెనింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ లాంటివి మార్చి మార్చి చేయడం వల్ల శరీరంలోని వేర్వేరు వ్యవస్థలు చురుకుగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇందులో వేగమైన నడక (బ్రిస్క్ వాకింగ్), మెట్లు ఎక్కడం, టెన్నిస్ వంటి రాకెట్ ఆటలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినవారిలో మరణాల ప్రమాదం గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. విభిన్నమైన వర్కవుట్లు ప్రయత్నించినవారు మంచి ఫలితాలు పొందవచ్చు అన్నమాట.