Pollution | దేశ రాజధాని ఢిల్లీలో దసరాకు ముందు వాయు కాలుష్యం భారీగా పెరిగింది. పరిస్థితి ఇలాగే దిగజారితే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ వాయు కాలుష్యం బారినపడకుండా రక్షణ చర్యలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఏటా దీపావళి తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం పెరుగుతుంది. ఆదివారం గాలి నాణ్యత సూచి (AQI) భారీగా పడిపోయి 266 వద్ద నమోదైంది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) దీన్ని స్టే-2గా వర్గీకరించింది. పేలవమైన గాలి నాణ్యత కారణంగా అనేక రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. గాలిలో కాలుష్య కారకాల కణాల (PM2.5)తో ప్రమాదం పెరుగుతుందని, ఇలాంటి వాతావరణంలో జీవించడం ద్వారా అనేక వ్యాధులు సోకే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
పీఎం 2.5స్థాయి ఉన్న గాలిని పీల్చడం ద్వారా గుండెజబ్బులు, ఆస్తమా తదితర సమస్యలుంటాయని హెచ్చరిస్తున్నది. అలాగే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని.. ఇప్పటికే మధుమేహం, శ్వాసకోశ వ్యాధి, గుండె సమస్యలతో బాధపడుతున్నటయితే వాయు కాలుష్యం కారణంగా మరింత తీవ్రమవుతుందని పేర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో టైప్-2 మధుమేహం ప్రమాదం పెంచడమే కాకుండా ఇప్పటికే షుగర్తో బాధపడుతున్న వ్యక్తులకు సైతం ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో శరీరంలో మంట పెరిగి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, ప్రతికూల ప్రభావంతో రక్తంలో షుగర్ లెవల్స్ను నియంత్రించే ఇన్సులిన్ను బలహీనపరుస్తాయి. అలాగే గట్లోనూ మార్పులకు వాయు కాలుష్యం కారణమవుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
కాలుష్యం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక గుండెపోటు.. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు స్పష్టం చేశాయి. పీఎం2.5 కారణంగా గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, కార్డియాక్ ఇస్కీమియా వంటి సమస్యలు సైతం పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు కాలుష్య బారినపడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గాలిలో ఉండే మైక్రోస్కోపిక్ కణాలు (PM2.5) చాలా చిన్నగా ఉంటాయి. అవి శ్వాసనాళాల్లోకి లోతుగా చొచ్చుకుపోతాయి. దీంతో ఊపిరితిత్తులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చికాకుతో పాటు దగ్గు, తుమ్ములు సమస్యలు పెరుగుతాయి. ఎక్కువకాలం వాయు కాలుష్య ప్రాంతంలో ఉంటే శ్వాసకోశ వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.