Fruits | కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. అయితే ఆహారంపై అవగాహన లేకపోవడంతో చాలా మంది అనేక పదార్థాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా దూరంగా ఉంచే వాటిల్లో పండ్లు కూడా ఒకటి. కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు పండ్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పండ్లు ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న విషయంలో జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో పొటాషియం స్థాయిలు, కిడ్నీ పనితీరు ఆధారంగా పండ్ల ఎంపిక ఉండాలి. సరైన పండ్లను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. తప్పుగా ఎంపిక చేసుకుంటే హైపర్కలేమియా వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.
క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రారంభ దశల్లో కిడ్నీలు సాధారణంగా పనిచేస్తుండటంతో ఎక్కువ రకాల పండ్లను మితంగా తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం పండ్లు, కూరగాయలు కిడ్నీ రోగుల్లో మూత్రంలో ఆల్బుమిన్ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో కిడ్నీ నష్టం వేగం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీ పనితీరు తగ్గే కొద్దీ పొటాషియం నియంత్రణ చాలా ముఖ్యమవుతుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 కిడ్నీ వ్యాధుల్లో అధిక పొటాషియం ఉన్న పండ్లను పరిమితం చేయాలి. అరటి, మామిడి, నారింజ వంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటంతో వాటిని తగ్గించడం మంచిది. ఆపిల్, పైనాపిల్, జామ వంటి పండ్లు తక్కువ పొటాషియం కలిగి ఉండటంతో మితంగా తీసుకోవచ్చు. కిడ్నీ వ్యాధి తీవ్రమైన దశకు చేరినప్పుడు లేదా డయాలసిస్ తీసుకుంటున్నప్పుడు ఆహార నియంత్రణ మరింత అవసరమవుతుంది. ఈ దశలో యాపిల్, బొప్పాయి, బెర్రీలు వంటి తక్కువ పొటాషియం ఉన్న పండ్లను మాత్రమే పరిమిత మోతాదులో తీసుకోవాలి. సాధారణంగా రోజుకు 100 గ్రాముల వరకు మాత్రమే పండ్లు తీసుకోవడం మంచిది.
అలాగే పండ్లరసాల విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. ఫ్రూట్ జ్యూసుల్లో పొటాషియం, చక్కెర మోతాదులు అధికంగా ఉండే అవకాశం ఉండటంతో వాటిని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. తక్కువ పొటాషియం ఉన్న పండ్లను తీసుకున్నా మోతాదు ఎక్కువైతే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పండ్లను కొలిచి తీసుకోవడం, ఒకేసారి అధికంగా తినకపోవడం అవసరం. మొత్తం ఆహారంలో పండ్ల మోతాదు సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. కిడ్నీ రోగులకు పండ్ల ఎంపిక ఇతర ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. మధుమేహం ఉన్నవారు చక్కెర స్థాయిలను దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే శరీరంలో ద్రవాల సమతుల్యత, రక్తంలోని పొటాషియం స్థాయిలను కూడా పరిశీలించి ఆహారం నిర్ణయించుకోవాలి.
పండ్లు ఆరోగ్యకరమైనవే కాబట్టి ఎంతైనా తినొచ్చని భావించడం తప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్యాకెట్ జ్యూసులు లేదా తాజా ఫ్రూట్ జ్యూసులను అధికంగా తీసుకోవడం ప్రమాదకరమవుతుంది. వైద్యులు సూచించిన డైట్ నియమాలను తప్పకుండా పాటించాలి. కిడ్నీ వ్యాధి ఉందంటే పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన ఎంపికతో మితంగా తీసుకుంటే అవి పోషకాహారంలో భాగంగా కొనసాగవచ్చు. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహారాన్ని సర్దుబాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.