లండన్ : వయోజనులతో పోలిస్తే 18 నుంచి 24 ఏండ్ల మధ్య యువతలో రాబోయే దశాబ్ధంలో ఊబకాయం ముప్పు పెరగనుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. యువతలో ఊబకాయం, అధిక బరువు సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం నెలకొందని విధాన రూపకర్తలకు అధ్యయనం సూచించింది. యూనివర్సిటీ కాలేజ్ లండన్, కేంబ్రిడ్జి వర్సిటీ, బెర్లిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా చేపట్టిన ఈ అధ్యయన వివరాలు లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రినాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
జెండర్, భౌగోళిక ప్రాంతం, సామాజికార్ధిక పరిస్ధితుల వంటి ఇతర కారణాలత పోలిస్తే యువజనులే అధిక బరువుకు ప్రధాన ముప్పు కారకంగా వెల్లడైందని పరిశోధకులు గుర్తించారు. బరువు పెరిగే ముప్పు యువతలో అత్యధికంగా ఉండటంతో పాటు వయసుతో పాటు బరువు క్రమంగా తగ్గుతున్నట్టు అధ్యయనంలో కనుగొన్నారు. 65 నుంచి 74 ఏండ్ల వారితో పోలిస్తే 18 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు వారు నాలుగు రెట్లు అధికంగా రాబోయే పదేండ్లలో బరువు పెరిగే ముప్పును కలిగిఉన్నారని పరిశోధకులు గుర్తించారు.
అధిక బరువుతో బాధపడే యువత అధిక బీఎంఐ క్యాటగిరీలో చేరే ముప్పు ఉందని వెల్లడైంది. యువతలో అధిక బరువు, ఊబకాయాన్ని నివారించే మార్గాలను గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టేందుకు ప్రజారోగ్య సంస్థలు, ప్రభుత్వాలు చొరవ చూపాలని అధ్యయన రచయిత ప్రొఫెసుర్ హెమింగ్వే సూచించారు.