Pregnancy | ‘ఒట్టి మనిషివి కూడా కాదు. ఇద్దరికి సరిపోయేంత తినాలి బిడ్డా’ అని కాబోయే తల్లులకు సలహా ఇస్తుంటారు. ప్రత్యేకమైన రుచులను కొసరి కొసరి వడ్డిస్తుంటారు. అలా అని, పెద్దల్నీ తప్పు పట్టలేం. మాతాశిశువుల ఆరోగ్యం బాగుండాలనే ఈ సలహా ఇస్తారు. అయితే, ఇద్దరి భోజనం ఒక్కరే చేయడం వల్ల కొన్ని సమస్యలూ ఎదురవుతాయి. గర్భిణులు బరువు పెరుగుతారు. ఊబకాయం బారినపడే ప్రమాదం ఉంది.
శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడమే ఊబకాయం. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఆధారంగా లెక్కిస్తారు. బీఎంఐ 25 29.8 మధ్య ఉంటే అధిక బరువు ఉన్నట్టు. అదే, 30కి మించితే ఊబకాయం ఊబిలో చిక్కుకున్నట్ట్టు. బీఎంఐ విలువను బట్టి ఊబకాయులను ఒకటి (30 35 మధ్య), రెండు (35 39), మూడు (40కి పైగా) వర్గాలుగా విభజిస్తారు. మోతాదుకు మించి తినడం వల్ల గర్భధారణ సమయంలోబరువు పెరిగే ఆస్కారం ఉంది. ఊబకాయం గర్భిణులకు రుగ్మతల ముప్పునూ
పెంచుతుంది. వాటిలో ప్రధానమైనవి..
ఊబకాయం.. గర్భధారణ రెండో త్రైమాసికం (ట్రైమెస్టర్)లో అధిక రక్తపోటుకు కారణమవుతుంది. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ఇదే. ఈ పరిస్థితి మరిన్ని ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది.
గర్భధారణ మలిదశలో.. లేదా ప్రసవమైన వెంటనే తీవ్రమైన జెస్టేషనల్ హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల ఊబకాయం ఉన్న స్త్రీలలో తరచుగా కాలేయం, కిడ్నీ వైఫల్యం, కొన్నిసార్లు మెదడు పనితీరులో తాత్కాలిక మార్పులు (సీజర్లు), గుండెపోటు, పక్షవాతం తదితర ఇబ్బందులు తలెత్తవచ్చు. పిండం పెరుగుదల, మావికి సంబంధించిన సవాళ్లూ ఎదురవుతాయి.
ఈ పరిస్థితిలో గర్భస్థ శిశువు సాధారణ బరువు కంటే ఎక్కువగా (మ్యాక్రోసోమియా) ఉంటాడు. దీంతో ప్రసవం కష్టం అవుతుంది. శిశువు గాయపడే ప్రమాదమూ ఉంది.
మధుమేహం గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయులు పెరగడమే జెస్టేషనల్ డయాబెటిస్. దీంతో పిల్లలు అధికబరువుతో పుట్టే అవకాశం ఉంది. ఫలితంగా, తల్లులకు సిజేరియన్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా జెస్టేషనల్ డయాబెటిస్ నిర్ధారణ అయిన మహిళల్లో డయాబెటిస్ మెలిటస్ అభివృద్ధి చెందే ముప్పు ఉంది. అది తల్లి నుంచి పిల్లలకు కూడా సంక్రమించవచ్చు.
నిద్రలో శ్వాసకు స్వల్ప అవరోధాలు ఏర్పడటమే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా. మహిళలను ఇట్టే అలసటకు గురిచేస్తుంది ఈ రుగ్మత. ప్రీ ఎక్లాంప్సియా, అధిక రక్తపోటు, గుండె, ఊపిరితిత్తుల సమస్యల ముప్పునూ పెంచుతుంది.
ఊబకాయ గర్భిణులు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, గుండె నిర్మాణంలో లోపాల్లాంటి అవకరాలు కలిగిన పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది.
అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తున్నప్పుడు.. శరీరంలో ఉన్న అధిక కొవ్వు.. తల్లి కడుపులోని పిండం శరీర నిర్మాణానికి సంబంధించిన సమస్యల్ని బయటికి తెలియనీయదు. పైగా ప్రసవం సమయంలో శిశువు హృదయ స్పందనను తెలుసుకోవడంలోనూ అవరోధం సృష్టిస్తుంది.
ఈ సమస్యకు ఒకటే పరిష్కారం. గర్భిణులు అదనపు బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. నిపుణుల సలహాను బట్టి ఈత, నడక లాంటి వ్యాయామాలను రోజుకు అరగంటైనా చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారమే తినాలి. తక్కువ కార్బొహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లకు భోజనంలో చోటివ్వాలి. మోతాదుకు మించి అన్నం తీసుకోకూడదు. చక్కెరను దూరం పెట్టాలి. సహజమైన చక్కెరలు ఉన్న ఆహారం, పానీయాలు మంచిది. శరీర వ్యవస్థలో ఏ చిన్న తేడా కనిపించినా వైద్యులను సంప్రదించాలి.