అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ఊపందుకోవడంతో పలువురిలో వైరస్ యాంటీబాడీలు తయారవుతున్నాయి. మే 28 జూన్ 3 మధ్యన నిర్వహించిన సెరో సర్వేలో అహ్మదాబాద్ నగరంలో అత్యధికంగా 87 శాతం మందిలో యాంటీబాడీలు తయారైనట్టు వెల్లడైంది. నగరంలోని నైరుతి జోన్లోని వెజ్లాపూర్, జోధ్పూర్, సర్కెజ్, మక్తంపురా ప్రాంతాల్లో అత్యధికుల్లో యాంటీబాడీలు ఉన్నట్టు గర్తించారు. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత ఈ సెరో సర్వే చేపట్టడం గమనార్హం.
ఏఎంసీ అధికారులు మొత్తం 5000 మంది నమూనాలను పరీక్షించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇతర నగరాలతో పోలిస్తే అహ్మదాబాదీయుల్లో అత్యధిక మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు ఈ సర్వేలో తేలిందని ఏఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించిన సెరో సర్వేలో 27.9 శాతం మందిలో కొవిడ్ యాంటీ బాడీలు గుర్తించగా తాజా సర్వేలో అవి 87 శాతానికి ఎగబాకాయని ఏఎంసీ అధికారి పేర్కొన్నారు. సెరోపాజిటివిటీ రేటు మహిళలతో పోలిస్తే పురుషుల్లో అధికంగా ఉందని వెల్లడైందని చెప్పారు.