న్యూఢిల్లీ : మంకీపాక్స్తో ప్రజారోగ్యానికి ఓ మాదిరి ముప్పు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న నేపధ్యంలో వైద్య నిపుణులు కీలక సూచనలు చేశారు. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ సోకిన వారు మూడు వారాల పాటు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పెంపుడు జంతువుల ద్వారా వైరస్ సంక్రమణ వ్యాప్తిచెందుతుందనే ఆందోళన వ్యక్తమవుతుండగా వైద్య నిపుణులు ఈ దిశగా మార్గదర్శకాలు జారీ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఇప్పటివరకూ దాదాపు 200కి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగుచూశాయి. మంకీపాక్స్ రోగుల్లో అత్యధికులు జ్వరం, వళ్లునొప్పులు, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తుండగా తీవ్ర అస్వస్ధతకు లోనైన వారిలో ముఖం సహా శరీర భాగాల్లో దద్దుర్లు, దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ఎలుకలు, కోతుల వంటి జంతువుల్లో గుర్తించిన వైరస్ నుంచి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రబలుతున్నట్టు గుర్తించారు. ఈ వైరస్ మధ్య, పశ్చిమాసియాలో ఎండెమిక్ దశకు చేరగా బ్రిటన్, అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో విస్తరిస్తోంది. ఇన్ఫెక్షన్స్ను గుర్తించి నియంత్రించేందుకు ఎలుకలు సహా పెంపుడు జంతువులను పరీక్షించి మూడు వారాల పాటు క్వారంటైన్లో ఉంచాలని ముఖ్యంగా వాటితో సన్నిహితంగా మెలిగే వారు ఈ జాగ్రత్తలు పాటించాలని బ్రిటన్ ఆరోగ్య భద్రతా ఏజెన్సీ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.