Metabolic Diseases : ఆధునిక జీవితంలో ఉరుకులు పరుగులు ఒత్తిళ్లతో సతమతమయ్యే క్రమంలో జీవనశైలి వ్యాధులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆహారాన్ని శక్తిగా మార్చే శరీర క్రియల సామర్ధ్యాన్ని జీవనశైలి వ్యాధులు దెబ్బతీస్తాయి. ఈ డిజార్డర్లు సాధారణ జీవక్రియలను విచ్ఛిన్నం చేస్తాయి. మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలను జీవక్రియలు సంగ్రహించి శరీరానికి శక్తినిచ్చి, పోషణ క్రియలను చేపడతాయి. చక్కటి సమన్వయంతో సాగే ఈ వ్యవస్ధ అస్తవ్యస్ధమైతే జీవనశైలి వ్యాధులు తలెత్తుతాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా జీవనశైలి వ్యాధుల్లో అత్యంత అధిక జనాభాను వేధిస్తోంది మధుమేహమని నిపుణులు చెబుతున్నారు.
ఇక మధుమేహంతో పాటు ఊబకాయం, గౌచర్ వ్యాధి, ఫెనీల్కిటోనురియ, మ్యాపిల్ సిరప్ యూరిన్ డిసీజ్, హెమోక్రోమటోసిస్ వంటి వ్యాధులు వెంటాడతాయి. ఈ పరిస్ధితులు తీవ్ర అలసట, బరువులో హెచ్చుతగ్గులు, వికారం వంటి లక్షణాలతో ఉంటాయి. ఇక భారత్లోనూ జీవనశైలి వ్యాధులు ప్రమాదకరంగా పెరుగుతూ ప్రజారోగ్య వ్యవస్ధపై భారం మోపుతున్నాయి. ముఖ్యంగా నగర భారతంలో మధుమేహం, హైబీపీ, హై ట్రైగ్లిజరైడ్స్ వంటి జీవనశైలి వ్యాధులు ప్రబలుతున్నాయి.
భారత్లో జీవనశైలి వ్యాధులకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో శారీరక వ్యాయామం, ఆరోగ్యకర ఆహారపు అలవాట్లు, రెగ్యులర్ హెల్త్చెకప్స్ వంటి చర్యలపై పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ విక్రమ్జీత్ వివరించారు. జీవనశైలి వ్యాధులను నిలువరించాలంటే మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, శరీర బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు మద్యం, ధూమపానం వంటి అలవాట్లను విడిచిపెట్టాలని ఆయన సూచించారు. ఇక రోజూ తగినంత సేపు నిద్రించకపోవడం కూడా మన శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడానికి కారణమని, దీంతో పలు జీవనశైలి వ్యాధులు తలెత్తే ముప్పు నెలకొందని చెప్పారు.
Read More :