పశుపక్ష్యాదులు మనిషికి తొలి గురువులు. వాటినుంచి మనిషి నేర్చుకోవాల్సింది కూడా చాలాఉంది. పిల్లల పెంపకమూ అందులో భాగమే. కంగారూ అనే జంతువు తన బిడ్డలను సురక్షితంగా కాపాడుకునే విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ‘కంగారూ మదర్ కేర్’ టెక్నిక్కు ప్రాణం పోశారు వైద్య నిపుణులు. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకు, నెల తక్కువ శిశువులకు ఇదో వరం.
తక్కువ బరువుతో.. నెలలు నిండకుండానే పుట్టే శిశువుల్లో మరణాల రేటు ఎక్కువే. ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమంది శిశువులు తక్కువ బరువుతో జన్మిస్తున్నారని, అందులో ఎనభై లక్షల మంది మన దేశంలోనే పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ బరువు బిడ్డల్లో 80 శాతం నెలలోపు శిశువులే. దాదాపు 65 శాతం మంది నెల తక్కువ బిడ్డలు. 19 శాతం మాత్రం.. జన్మించిన తరువాత వివిధ కారణాలతో బరువు పెరగకపోవడంతో మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తున్నది. ఇలాంటి శిశువులను కంగారూ మదర్కేర్ (కేఎంసీ)తో కాపాడుకోవచ్చు.
‘కంగారూ మదర్ కేర్’ అంటే..
కంగారూ అనగానే మనకు గుర్తొచ్చేది.. కడుపులోని సంచిలో పిల్లను దాచుకునే అందమైన జంతువు. కంగారూ పిల్లలు నెలలు నిండకుండానే జన్మిస్తాయి. అలా పుట్టిన బిడ్డలను ఆ జంతువు తన కడుపులోని సంచిలో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. పూర్తిగా ఎదిగిన తరువాతనే బయటికి విడిచి పెడుతుంది. ఇదే పద్ధతిలో.. తక్కువ బరువుతో, నెలలు నిండకుండా జన్మించిన శిశువులను సైతం తల్లి ఒడిలో పెట్టి చికిత్స చేస్తారు. అందుకే ఈ పద్ధతిని ‘కంగారూ మదర్ కేర్’ అని పిలుస్తారు. ఆరోగ్యవంతమైన శిశువు అంటే.. కనీసం 2.5 కిలోల బరువుతో జన్మించాలి. అంతకంటే తక్కువ ఉంటే ‘లో బర్త్ వెయిట్ బేబీ’గా పేర్కొంటారు. ఇంకా తక్కువ బరువుతో జన్మిస్తే ‘ప్రత్యేక శిశువు’గా పరిగణిస్తారు. ఇలాంటి శిశువుల్లో మరణాల రేటు అధికంగా ఉంటుంది. ఆ అకాల మృత్యువును హరించేందుకు.. కంగారూ కేర్ విధానం ఉపయోగపడుతుంది.
చికిత్స.. ప్రయోజనాలు
కంగారూ మదర్ కేర్ పద్ధతిలో తల్లిపాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ టెక్నాలజీతోనూ పెద్దగా పన్లేదు. కొద్దిపాటి సదుపాయాలు చాలు. ప్రకృతి సిద్ధమైన విధానంలో.. శిశువును తల్లి ఒడిలోనే ఓ పద్ధతి ప్రకారం ఉంచడం వల్ల బిడ్డ ప్రాణాలు నిలబెట్టవచ్చు. ఈ చికిత్సకు సెమీ రిక్లెయినింగ్ పడకలు లేదా కుర్చీలుఅవసరం అవుతాయి. వీటిపై తల్లిని పాక్షికంగా పడుకోబెట్టి.. తల్లి స్పర్శ తగిలేలా, ఆమె గుండెలపై శిశువును బోర్లా పడుకోబెడతారు. ఆ సమయంలో బిడ్డ ఒంటిపై బట్టలు ఉండకూడదని చెబుతారు. దీనివల్ల తల్లి శరీర ఉష్ణోగ్రత బిడ్డకూ అందుతుంది.
తల్లి స్పర్శ ధారాళంగా తగలడంతో.. శిశువులో స్పర్శ జ్ఞానం వృద్ధి చెందుతుంది. సాధారణంగా బాలింతల వద్ద ఒక రకమైన వాసన వస్తుంది. ఈ పరిమళాన్ని శిశువు గుర్తించడంతో బిడ్డలో ఘ్రాణశక్తి వృద్ధి చెందుతుంది. తల్లి పాలు తాగడంతో బిడ్డకు రుచి తెలుస్తుంది. తల్లి గుండె చప్పుడు వినడం వల్ల వినికిడి సామర్థ్యమూ అధికం అవుతుంది. తల్లి హావభావాలు, కదలికలను చూసీచూసీ బిడ్డలో దృష్టి సామర్థ్యం పెరుగుతుంది. ఇలా.. బరువు తక్కువ శిశువులో జ్ఞానేంద్రియాలు వికసిస్తాయి. అంతేకాదు..
తొలిసారిగా..
కంగారూ మదర్ కేర్ పద్ధతిని తొలిసారిగా కొలంబియాలో అనుసరించారు. రే-మార్టిన్ అనే వైద్య నిపుణుల ఆలోచన ఇది. ఆ రోజుల్లో శిశు మరణాల సంఖ్య అధికంగా ఉండేది. ఇన్క్యుబేటర్ల కొరత తీవ్రంగా వేధించేది. ఎలాగైనా సరే, బిడ్డలను కాపాడుకోవాలనే ఆలోచనతో ఆ ఇద్దరూ కంగారూను స్ఫూర్తిగా తీసుకుని.. సరికొత్త టెక్నిక్ను ఆవిష్కరించారు. దీంతో శిశు మరణాలు ముప్పై శాతం నుంచి డబ్భుశైతం వరకూ తగ్గినట్టు నాటి అధ్యయనంలో వెల్లడైంది. కన్నతల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. అమ్మ స్థానంలో నాన్న కంగారూ సంరక్షణ అందించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
అమ్మలకూ మంచిదే..
పొట్ట సంచిలో బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు.. ఆ తల్లి పొందే ఆనందం అంతాయింతా కాదు. బాలింత సంతోషంగా ఉందంటే.. ఆమె మనసూ ప్రశాంతంగా ఉన్నట్టే. ఫలితంగా ఆనంద హార్మోన్ల ఊట పెరుగుతుంది. బిడ్డపట్ల ప్రేమ పొంగిపొర్లుతుంది. తల్లీ బిడ్డల అనుబంధం బలపడుతుంది. పాలధార రెట్టింపు అవుతుంది. బిడ్డను పెంచి పెద్దచేయగలననే నమ్మకం వచ్చేస్తుంది. అప్పటి
వరకూ.. భవిష్యత్తు గురించి అలుముకున్న భయాలు, అపోహలూ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి.
మాతృత్వంలోని ప్రతిదశనూ ఆస్వాదిస్తుంది ఆ తల్లి. పరిపూర్ణ ఆరోగ్యవంతులైన బిడ్డలకూ ఈ సూత్రాన్ని అన్వయించవచ్చు. బాలింతరాలు రోజూ కొద్దిసేపు బిడ్డకు కంగారూ పద్ధతిలో పోషణ అందించవచ్చు. బిడ్డ తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు మాత్రం.. నిపుణుల సలహా తీసుకున్నాకే మొదలు పెట్టాలి. సుశిక్షితులైన నర్సుల సమక్షంలోనే ఈ ప్రక్రియ జరగాలి. నవజాత శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. కాబట్టి, తల్లివైపునుంచి జాగ్రత్తలు తప్పనిసరి. బిడ్డకు ఎలాంటి ఇన్ఫెక్షన్లూ సోకకుండా ఉండాలంటే.. తగినంత
పరిశుభ్రత పాటించాలి.
సరైన పోషకాహారం తీసుకోవాలి. రోజూ స్నానం చేయాలి. ఉతికిన దుస్తులు ధరించాలి. ఆ వస్ర్తాలు వదులుగా ఉంటేనే, ఆమెకు సౌకర్యవంతంగా అనిపిస్తుంది. టాయిలెట్కు వెళ్లొచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే.. కంగారూ విధానం పరిపూర్ణ ఫలితాలను ఇస్తుంది. బాలింతరాలి గదిలో తల్లి- పిల్ల కంగారూ బొమ్మ లేదా పోస్టరు ఉంటే మరీ మంచిది. అన్నిటికీ మించి.. ఈ పద్ధతి ద్వారా మంచి జరుగుతుందనీ, బిడ్డ ఆరోగ్యం మెరుగవుతుందనీ ఆ తల్లి బలంగా నమ్మాలి.
బరువు తక్కువ పిల్లలకు, నెల తక్కువ చిన్నారులకు.. నిత్యం ఏదో ఓ సమస్య ఉండనే ఉంటుంది. మిగిలిన శిశువులతో పోలిస్తే రోగ నిరోధక శక్తి కూడా తక్కువే. కాబట్టి, ఏ చిన్న రుగ్మతనూ నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. చర్మం రంగు మారడం, డయేరియా, తరచూ జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, రోజుల తరబడి మలమూత్ర విసర్జన ఆగిపోవడం, ఎడతెరిపిలేని ఏడుపు.. తదితర లక్షణాలు కనిపించినప్పుడు.. వెంటనే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి. చిట్కాలతో సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటే పొరపాటే. అందులోనూ కవల పిల్లలు పుట్టినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు పిల్లలూ కొంత బలహీనంగానే ఉంటారు.
…?మహేశ్వర్రావు బండారి
-డాక్టర్ బి.రమేష్ బాబు దాంపురి చిన్నపిల్లల వైద్యనిపుణులు, యువ విభాగం నోడల్ అధికారి నిలోఫర్ హాస్పిటల్, హైదరాబాద్