Curd | చాలా మంది ఆహారంలో పెరుగు ఒక భాగమని చెప్పవచ్చు. పాలతో తయారు చేసే ఈ పెరుగును ఎంతో కాలంగా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పెరుగులో శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ముఖ్యంగా పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయినప్పటికీ పెరుగును తినడంపై చాలా మంది అనేక అనుమానాలను కలిగి ఉంటారు. పెరుగును తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు రావడంతో పాటు పెరుగు తినడం వల్ల శరీరం బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. అయితే పెరుగు శరీరానికి ఎలాంటి హాని కలిగించదని, పెరుగు తీసుకునే సమయం, దానిని ఎలా తీసుకుంటున్నారు అనే విధానం, అలాగే దానికి శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పెరుగు తీసుకోవడంపై ప్రజలు కలిగి ఉన్న అపోహల గురించి వాటి వెనుక దాగి ఉన్న నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది పెరుగు తీసుకోవడం వల్ల శ్లేష్మం పెరుగుతుందని శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. కానీ పెరుగు తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయనడం వెనుక ఎటువంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. శరీర సున్నితత్వం వల్ల మాత్రమే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని పెరుగును తీసుకోవడం వల్ల ఎటువంటి హాని కలగదని నిపుణులు తెలియజేస్తున్నారు. రాత్రి సమయంలో పెరుగును చాలా మంది తినరు. కానీ చక్కని జీర్ణవ్యవస్థ కలిగిన వారు రాత్రి భోజనంలో పెరుగును తీసుకోవచ్చు. అయితే వేయించిన ఆహారాలు, చక్కెరలతో కలిపి పెరుగును తీసుకోకూడదు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
పెరుగు తీసుకోవడంపై ఉన్న అతి పెద్ద అపోహలల్లో బరువు పెరగడం ఒకటి. కానీ ఇది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు. పెరుగు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియను పెంచుతాయి. తద్వారా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగి శరీర బరువు తగ్గుతుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. జీవక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. తాజా పెరుగు జీర్ణక్రియకు మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే పుల్లని పెరుగు, ఎక్కువగా పులిసిన పెరుగును తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యం సరిగ్గా లేని వారిలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
చాలా మంది పెరుగును భోజనంతో తీసుకోకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ పెరుగును భోజనంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. అలాగే మధుమేహ వ్యాధి గ్రస్తులు పెరుగుకు దూరంగా ఉండాలి అని కొందరు చెబుతూ ఉంటారు. కానీ పెరుగు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు పెరుగును తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. పెరుగుపై ఉన్న అపోహలను గుడ్డిగా నమ్మి పెరుగు తీసుకోకపోవడం సరి కాదని పెరుగు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. సాధారణంగా కవర్లల్లో ప్యాక్ చేసిన పెరుగును తీసుకోకపోవడమే మంచిదని ఇంట్లో తయారు చేసిన లేదా స్పష్టంగా లేబుల్ చేసిన పెరుగును తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.