Lymphoma | లింఫోమా.. ఒక రకమైన రక్త క్యాన్సర్. నేరుగా శోషరస గ్రంథుల వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. శరీరంలో శోషరస గ్రంథుల పాత్ర చాలా ప్రధానమైంది. వివిధ ఇన్ఫెక్షన్లకు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత వీటిదే. శోషరస గ్రంథులు, శోషరస నాళం, ప్లీహం, అస్థిమజ్జ మొదలైన భాగాలకు .. శోషరస వ్యవస్థే రక్షణ కవచం. ఒక రకమైన కణాలైన లింఫోసైట్లు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఆయా భాగాల్లో కణుతులు ఏర్పడి.. లింఫోమాకు దారితీస్తుంది. దురదృష్టవశాత్తు ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువే. కానీ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ప్రాణాలను కబళిస్తున్న క్యాన్సర్లలో లింఫోమా ఆరో స్థానంలో ఉంది. ఏటా ఏడు లక్షల కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇంత విశృంఖలంగా ప్రబలుతున్నా.. చాలామందికి లింఫోమా క్యాన్సర్ గురించి కానీ, వ్యాధి లక్షణాల గురించి కానీ అవగాహన ఉండటం లేదు. ‘గ్లోబోకాన్’ సంస్థ పరిశీలన ప్రకారం.. భారత్లో వేగంగా వ్యాపించే రక్త క్యాన్సర్లలో లింఫోమా ప్రధానమైంది. దేశంలో ఏటా తొంభైవేల వరకూ కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. లింఫోమాకు కచ్చితమైన కారణాలు తెలియకపోయినా.. వృద్ధాప్యం, రసాయన సంబంధమైన పరిశ్రమలలో పనిచేయడం, రసాయన వ్యర్థాలకు చేరువలో జీవించడం, కుటుంబ చరిత్ర.. తదితర అంశాలను తేలిగ్గా తీసుకోలేం. వ్యవసాయానికి వాడే పురుగుల మందులు కూడా దీనికో కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. లింఫోమా క్యాన్సర్లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి.
ఒకటి.. హాడ్గ్కిన్ లింఫోమా. రెండు.. నాన్-హాడ్గ్కిన్ లింఫోమా. మొదటిదైన హాడ్గ్కిన్ లింఫోమా చాలా అరుదుగా వస్తుంది. లింఫోమా కేసులలో దీని వాటా 10 శాతం మాత్రమే. వ్యాధి రకాన్ని బట్టి, దశను బట్టి లింఫోమా లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం సర్వ సాధారణం.
.. అయితే ఈ లక్షణాలు ఇతర సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. కొన్నిసార్లు ఏది లింఫోమా క్యాన్సర్, ఏది సాధారణ శ్వాసకోశ సమస్య అనే విషయంలో నిపుణులు ప్రాథమిక నిర్ధారణకు రాలేకపోవచ్చు. కాబట్టి ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి వారాల తరబడి వెంటాడినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే లింఫోమా క్యాన్సర్ను జయించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్గా పొరబడి తేలిగ్గా తీసుకునేవారూ ఉన్నారు. ఫలితంగా నిర్ధారణ, చికిత్స ఆలస్యమై పోతుంది. వ్యాధి మలిదశకు చేరుకుంటుంది.
నిర్ధారణ-వైద్యం
లింఫోమా క్యాన్సర్ను ఎదుర్కొనే క్రమంలో.. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్న దవాఖానకు వెళ్లాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని బేరీజు వేయడానికి సీటీ స్కాన్, పెట్ సీటీ స్కాన్, బయాప్సీ లాంటి ఇమేజింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ బయాప్సీ ద్వారా కచ్చితమైన నిర్ధారణ జరుగుతుంది. బయాప్సీలో అనుమానిత కణితి నుంచి కణజాలం నమూనాను తీసుకుని, సూక్ష్మదర్శిని కింద పరీక్షించడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ రకం, దశ, రోగి వయసు, ఇతర రుగ్మతలు.. తదితర అంశాలపై లింఫోమా క్యాన్సర్ చికిత్స ఆధారపడి ఉంటుంది. కీమో థెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యునో థెరపీ, మూలకణాల మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్) లింఫోమా క్యాన్సర్ చికిత్సలో ముఖ్యమైన విధానాలు. ఆహారంలో పోషక విలువలకు సంబంధించి.. న్యూట్రిషన్ కౌన్సెలింగ్, చికిత్స తర్వాత నొప్పిని తట్టుకోవడానికి సరిపడా శారీరక, మానసిక బలాన్ని ఇవ్వడానికి పెయిన్ మేనేజ్మెంట్, మద్దతు చికిత్సలు అవసరమవుతాయి. లింఫోమా చికిత్స వల్ల అరుదుగా వంధ్యత్వం లాంటి దుష్పలితాలు కనిపించినా.. త్వరగానే సర్దుకుంటాయి.
‘మెరుపుదాడి’ చికిత్స
సీఏఆర్టీ-సెల్ థెరపీ లాంటి అధునాతన, టార్గెటెడ్ చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానాల్లో క్యాన్సర్పై పోరాటానికి వ్యాధిగ్రస్తుని రోగ నిరోధక వ్యవస్థలోని ఇమ్యూన్ కణాలను ఉపయోగించుకుంటారు. క్యాన్సర్ సోకిన లింఫోమా కణాల మీద మాత్రమే దాడిచేస్తూ, ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని కలిగించని ఇలాంటి చికిత్సలను రక్త క్యాన్సర్ల మీద మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రైక్స్)గా చెప్పుకోవచ్చు. ఇవి హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లాంటిచోట్ల లభిస్తున్నాయి. వీటి మద్దతుతో లింఫోమా క్యాన్సర్ల నుంచి.. రోగులు 80 శాతం నుంచి 90 శాతం వరకు పూర్తిగా కోలుకుంటున్నారు. ఆరోగ్య కరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్టు లింఫోమా క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి, చికిత్స చేయించుకుంటే సత్వరంగా కోలుకునే అవకాశాలు ఎక్కువ.
ఇంకేదో రోగ లక్షణంగా పొరబడితే మాత్రం, శరీరంలోని లింఫటిక్ వ్యవస్థ మొత్తం మీద ప్రభావం పడుతుంది. వ్యాధితో పోరాటం కష్టం అవుతుంది. కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు ప్రాణాలకూ ముప్పు ఉండవచ్చు.కాబట్టి, శరీరంలో దీర్ఘకాలం పాటు అనుమానించాల్సిన లక్షణాలు కనిపించినా, అనూహ్యమైన మార్పులు దృష్టికి వచ్చినా.. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. లింఫోమా క్యాన్సర్ రోగిని ముప్పు తిప్పలు పెట్టే మొండిఘటమే అయినా, రోగి ఆత్మస్థయిర్యాన్ని కోల్పోవాల్సిన పన్లేదు. అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, కుటుంబసభ్యుల అండదండలతో, స్నేహితుల నైతిక మద్దతుతో ఈ క్యాన్సర్ను జయించడం అసాధ్యమేం కాదు. నిజానికి, ఆరోగ్య కరమైన జీవనశైలితో ఒక్క లింఫోమా అనేకాదు, అన్ని క్యాన్సర్లను సమర్థంగా అడ్డుకోవచ్చు.
– డాక్టర్ గణేశ్ జైషెత్వార్,
సీనియర్ హెమటాలజిస్ట్,
హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బీఎంటీ స్పెషలిస్ట్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్