సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్.. అంటారు. ధూమపానం ఎంత ప్రమాదకరమో, గంటలకొద్దీ కూర్చునే అలవాటూ అంతే ప్రాణాంతకం. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హాయిగా కూర్చోవడం.. ఓ విలాసం కానేకాదు, తీవ్ర అనారోగ్యాల దిశగా తొలి అడుగు. రోజంతా సీటుకు అతుక్కోవడం, గంటలతరబడి పడుకోవడం హానికరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కదలికలు లేని జీవనశైలి వల్ల రక్తపోటు అధికం అవుతుంది, మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది, రక్తంలో చక్కెర పెరుగుతుంది, వెన్నునొప్పి, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయి కూడా.
మిగిలినవారితో పోలిస్తే.. రోజూ కనీసం 8 గంటలు కూర్చుని ఉండేవారికి గుండెపోటు ముప్పు 20 శాతం ఎక్కువ. పక్షవాతం లాంటి సమస్యల ముప్పు 17 శాతం నుంచి 50 శాతం అధికం. అంతేకాదు, ఊబకాయం జీవితంలో భాగం అవుతుంది.
కార్యాలయాల్లో పనిచేసే వాళ్లు గంటల తరబడి కదలకుండా ఒకే దగ్గర కూర్చోకుండా, మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. కిటికీ దగ్గరికి వెళ్లి బయటి ప్రపంచాన్ని చూడాలి. దీనివల్ల కండ్లకు విశ్రాంతి దొరుకుతుంది. వీలైతే డెస్క్ దగ్గరే యోగాసనాలు వేయాలి. తోటి ఉద్యోగులకు మెసేజ్లు పంపే బదులు.. నేరుగా వారి సీటు దగ్గరికి వెళ్లి మాట్లాడితే శరీరాన్ని కదిలించినట్టు ఉంటుంది. యోగా, స్కాష్ లాంటి ఇండోర్ యాక్టివిటీస్ భాగం చేసుకోవాలి. కుర్చీకి అతుక్కుపోయి పుస్తక పఠనం చేయడం కంటే.. నడుస్తూ ఆడియో బుక్స్ వినడం మంచిది. ఇంటిని తుడుచుకోవడం, బట్టలు ఉతుక్కోవడం కూడా మంచి వ్యాయామాలే.
ఎక్కువసేపు కూర్చునే ఉండటం వల్ల కీళ్లు, ఎముకలు, కండరాలపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. శరీరాకృతి దెబ్బతింటుంది. ముఖ్యంగా తల వేలాడేసుకుని పనిచేయడం వల్ల జీవక్రియలు దారితప్పుతాయి. ఎముకల సాంద్రత, శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గిపోతాయి. శోష గ్రంథుల పనితీరు మందగిస్తుంది. దీంతో రక్త సరఫరా వ్యవస్థ, శరీరానికి ఆక్సిజన్, పోషకాలు చేరవేసే వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది.
ఒకేచోట ఎక్కువసేపు కూర్చుంటే ఒంటి నొప్పులతోపాటు ఊబకాయం, టైప్ 2 మధుమేహం, హైపర్ థైరాయిడిజం లాంటి రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే, రోజూ పదివేల అడుగులైనా వేయాలి. చిన్నాపెద్దా వ్యాయామాలు చేస్తూ ఉండాలి. లేకపోతే మన జీవనశైలి చురుకుదనాన్ని కోల్పోతుంది. రోజూ ఎన్ని అడుగులు వేస్తున్నామో తెలుసుకునేందుకు పెడోమీటర్ లాంటి ఉపకరణాలు పనికొస్తాయి.