ఎండాకాలంలో బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. మండుటెండల్లో వడదెబ్బ, డీహైడ్రేషన్ సర్వసాధారణం. దీనిని నివారించాలంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం మంచి మార్గం. ఒంట్లో వేడి పెరిగితే కనిపించే లక్షణాలు, శరీరం కూల్ అవ్వాలంటే పాటించాల్సిన చిట్కాలను తెలుసుకుందాం.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మన శరీరం తన సహజసిద్ధమైన చల్లదనాన్ని కోల్పోతుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కేవలం చెమట మాత్రమే కాకుండా ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అధిక దాహం, నోరు ఎండిపోవడం, మూత్రం పసుపు రంగులోకి మారడం లేదా మంటగా అనిపించడం, తరచుగా తల తిరగడం, అలసట, కండరాల నొప్పులు, చర్మంపై వేడి కురుపులు లేదా దురద రావడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఇలాంటి సందర్భంలోనే శరీరాన్ని చల్లబరుచుకోవడానికి కొన్ని మార్పులు తప్పనిసరి. వేసవిలో రోజుకు కనీసం 3- 4 లీటర్ల నీరు తాగాలి. బయటికి వెళ్లేటప్పుడు వెంట నీళ్ల బాటిల్ ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల గాలి తగిలి చెమట త్వరగా ఆరిపోతుంది.
మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎండలో తిరగడం తగ్గించాలి. వీటితోపాటు ప్రకృతి అందించిన ఆహార పదార్థాలతో వేడిని సులభంగా తగ్గించవచ్చు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు అత్యుత్తమ కూలెంట్గా పనిచేస్తాయి. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మరసం తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. అయితే చాలా చల్లగా ఉండే డ్రింక్స్ శరీరాన్ని త్వరగా చల్లబరుస్తాయని అనేకమంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే.
అత్యంత చల్లని ఆహారాలు జీర్ణక్రియను ప్రభావితం చేసి, గొంతుకు చికాకు కలిగిస్తాయి. పప్పు, అన్నం, కూరగాయలు వంటి తేలికపాటి భోజనం చేయడం శరీరానికి మేలు చేస్తుంది. ఎకువగా వేయించిన, మసాలా ఆహారాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. చివరిగా మీ శరీరం ఇచ్చే సంకేతాల్ని నిర్లక్ష్యం చేయకండి. తల తిరగడం, నీరసంతో పాటు అధిక వేడి వల్ల సృ్పహ తప్పడం, విపరీతమైన వాంతులు అవుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండటం ద్వారా వేసవి తాపం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.