పర్యాటక పర్వంలో రకరకాల విహారాలు ఉన్నాయి. పుణ్యం కోసం తీర్థయాత్ర. కాలక్షేపం కోసం విహారయాత్ర. ప్రేమ యాత్రలు, విజ్ఞాన యాత్రలు.. ఎన్నెన్నో! వీటి సరసన ఇప్పుడు మరో యాత్ర వచ్చి చేరింది. అదే కునుకు యాత్ర. పని ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితానికి కామా పెట్టి.. నాలుగు రోజులు ఆదమరచి నిద్రపోవడానికి ఉద్దేశించిన విహారం ఇది. వేళ పట్టున ఇంటికి చేరినా, కడుపు నిండా ఆహారం తిన్నా.. కంటి నిండా కునుకు కరువవుతున్న వారు సుఖమెరగని నిద్ర కోసం సౌకర్యవంతమైన నెలవులకు వెళ్తున్నారు. ఈ ట్రెండ్ రెండేండ్ల కిందటే పురుడు పోసుకున్నా.. ఈ మధ్య ఊపందుకుంది. మాత్రలు వేసుకున్నా నిద్రపట్టని దురదృష్టవంతులు ఈ యాత్రలకు పూనుకుంటున్నారు. కునుకు కోసం పరితపిస్తున్న వారికోసం పలు పర్యాటక సంస్థలు ప్రకృతి ఒడిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
పర్వత సానువుల్లో, వనసీమల్లో ఉన్న రిసార్టులు స్లీప్ టూరిజం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. నిద్ర కోరి వచ్చినవారికి హంసతూలికా తల్పం పెట్టి, పాలనురుగు దుప్పటి చుట్టి, మబ్బులతో మలచిన దిండు అందుబాటులో ఉంచితే.. కంటిపాపను కునుకమ్మ ఇట్టే కమ్మేస్తుంది. కొన్ని రిసార్టుల్లో నిద్రావస్థ త్వరగా ఆవహించడానికి యోగాసనాలు కూడా వేయిస్తున్నారు. వద్దన్నా వచ్చే నిద్ర కోసం ఇంతగా ఖర్చు చేయాలా అంటే.. అవుననే సమాధానమే వస్తుంది! లక్షల్లో వేతనం వస్తున్నా.. మానసిక ఒత్తిళ్లు, స్క్రీన్ టైమ్ విపరీతంగా పెరిగిపోవడంతో నిద్ర తగ్గిపోతున్నది. ఇలాంటి వాళ్లే స్లీప్ టూరిజం పేరిట కాంక్రీట్ జంగిల్కు దూరంగా వెళ్లిపోయి.. ఏ పాట్లూ లేకుండా నిద్రాదేవిని ఉపాసిస్తున్నారు.