Cancer | క్యాన్సర్ ఒంటికన్ను రాక్షసేం కాదు. దాని పరిమితులు దానికున్నాయ్. దాని బలహీనతలు దానికున్నాయ్. ప్రేమను చిదిమేయడం రాదు. ఆశను ఆర్పేయడం చేతకాదు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. ధైర్యం నోరు నొక్కే సాహసం కూడా చేయలేదు. అంతేనా..
ఆ విలనిజంలోనూ కొంత హ్యూమనిజం ఉంది. క్యాన్సర్తో పోరాటం మనిషికి బతుకు మీద మమకారాన్ని కలిగిస్తుంది. గెలవాలనే కోరికను రగిలిస్తుంది. పోరాటస్ఫూర్తిని నింపుతుంది. సర్జరీలను తట్టుకునే శక్తిని, కీమోను భరించే ఓపికను, రేడియేషన్ థెరపీని అంగీకరించే సహనాన్ని ప్రసాదిస్తుంది. ఏటా ప్రతి లక్షమందిలో వంద కొత్త కేసులు బయటపడుతున్నాయి. ప్రతి తొమ్మిదిమందిలో ఒకరు తమ జీవితంలోని ఏదో ఓ సమయంలో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంది. యుద్ధానికి అవసరమైనట్టే క్యాన్సర్నియంత్రణకూ పక్కా వ్యూహం కావాలి. అదెలా అన్నది చెబుతున్నారు రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి తన ‘లివ్ ఫర్ ఎ లెగసీ’లో. ఆ ఆంగ్ల పుస్తక సంక్షిప్త సారం..
ఆధునిక యుగంలో అక్షరాస్యతకు అర్థం మారిపోయింది. చదవడం, రాయడం తెలిసినంత మాత్రాన విద్యావంతులని అనలేం. చదవాలి. చదివింది మరిచిపోవాలి. మళ్లీ మళ్లీ చదవాలి. నిన్నటి నిజం.. నేటి నిజం కాకపోవచ్చు. సరికొత్త సత్యమేదో ఆవిష్కృతమై ఉండవచ్చు. దాన్ని ఒడిసిపట్టుకోవాలి. క్యాన్సర్ పట్ల అవగాహనకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. సమాజానికి క్యాన్సర్ అంటే భయం. ఆ భయంలోంచి పుట్టుకొచ్చిన అపోహలు అనేకం. అందుకే, ‘క్యాన్సర్ ఎడ్యుకేషన్’ ప్రాధాన్యం పెరుగుతున్నది. ఇక రెండోది, సాధ్యమైనంత త్వరగా వ్యాధి నిర్ధారణ జరగాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం, నిర్లిప్తత వద్దు. చిట్కాలు, చెట్ల మందులు నమ్ముకోవద్దు. శరీరంలో ఏ చిన్నమార్పు కనిపించినా.. అందులో క్యాన్సర్ మూలాలను అనుమానించాల్సిందే. కచ్చితమైన రోగ నిర్ధారణ జరగాల్సిందే. ఏం భయం లేదు. అత్యంత సమర్థమైన చికిత్సలు మనకిప్పుడు అందుబాటులో ఉన్నాయి. చేయితిరిగిన క్యాన్సర్ వైద్యులూ చాలామందే ఉన్నారు. ఎంత త్వరగా సంప్రదిస్తే అంత వేగంగా ఒడ్డున పడేస్తారు. తదుపరి దశ పునరావాసం. ఇది వైద్యానికి అనుబంధం. అనుబంధాలూ ఆప్యాయతలే ప్రధానమైన దశ. జీవితంపై కొత్త ఆశలు రేకెత్తించాల్సిన బాధ్యత అయిన వారిదే. క్యాన్సర్ వ్యక్తిని మాత్రమే బాధించదు. అతని కుటుంబాన్నీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. బంధువుల్ని, ఆత్మీయుల్ని కల్లోలానికి గురిచేస్తుంది. చుట్టూ ఉన్న సమాజాన్ని స్థిమితంగా ఉండనీయదు. అందుకే క్యాన్సర్ను సామాజిక వ్యాధిగా పరిగణిస్తారు. క్యాన్సర్ చికిత్సను ఓ నాణెం అనుకుంటే.. దానికి సైన్స్ బొమ్మ, సహానుభూతి బొరుసు. రోగికి రెండూ అవసరమే. సంపన్నుల విషయంలో క్యాన్సర్ ఒకానొక రుగ్మత మాత్రమే. డబ్బుతో వైద్యం చేయించుకోగలరు. వైద్యంతో క్యాన్సర్ కణాలను నిలువరించగలరు. సామాన్యుల మాటేమిటి? ఆ సామాజిక వ్యాధి నుంచి సమాజమే కాపాడాలి. అంటే, మనమే! ఆ సాయం చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. రోగికి ఓ పూట కడుపు నింపవచ్చు. ఓ పొద్దు మందులు అందించవచ్చు. కీమో ఖర్చులకూ ఉపయోగపడవచ్చు.
* * *
హిప్పోక్రటీస్ పాశ్చాత్య ప్రపంచం తొలి ఫిజీషియన్గా గౌరవిస్తుంది. ఇప్పటికీ వైద్య విద్య పూర్తిచేసిన పట్టభద్రులు హిప్పోక్రటీస్ సాక్షిగా ప్రమాణం చేయడం సంప్రదాయం. ఆ మాయరోగం చివరి దశకు చేరుకున్న రోగుల శరీరం మీద.. ఎండ్రకాయను పోలిన ట్యూమర్లను చూసి ‘క్యాన్సర్’ అనే పేరు పెట్టినట్టున్నాడు హిప్పోక్రటీస్. క్యాన్సర్ స్వతహాగా జన్యుపరమైన వ్యాధి. చాలామంది జన్యు ఉత్పరివర్తనాల కారణంగా.. క్యాన్సర్ బారినపడతారు. కాకపోతే, మన ఆయువును జన్యువులు ఇరవైశాతం మాత్రమే నిర్దేశిస్తాయి. మనం ఎలా జీవిస్తున్నాం, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఏం పీలుస్తున్నాం.. మొత్తంగా మన జీవనశైలి ఎనభైశాతం మేర నిర్ణయం తీసుకుంటుంది. వారసత్వ క్యాన్సర్లు ఐదు నుంచి పదిశాతం లోపే. కుటుంబసభ్యుల్లో ఎవరికైనా యాభై ఏళ్లలోపే చాతీ, గర్భాశయ క్యాన్సర్ లాంటివి వచ్చుంటే మాత్రం.. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. దురదృష్టంలోనూ అదృష్టం ఏమిటంటే.. గత పదేళ్లలో క్యాన్సర్ నిరోధం, నిర్ధారణ, చికిత్స, పునరావాసం.. తదితర విషయాల్లో మనం ఎంతో పురోగతి సాధించాం. సాధారణ కణాలు, క్యాన్సర్ కణాల ఆక్సిజన్ స్థాయుల్లో తేడాలను బేరీజు వేస్తున్నారు. అన్నిటికీ మించి, క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ప్రాణాలను నిలిపే అతిగొప్ప ప్రయత్నం. అలా అని, స్థిమితపడే వాతావరణమూ లేదు. ఈ ఏడాది చివరికి ముప్పై లక్షలమంది రోగులు చికిత్స కోసం ఎదురుచూస్తుంటారని అంచనా. ఇంకో ఏడేళ్లలో ఆ సంఖ్య యాభై లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదు. వైద్య ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్న విషయం ఇది. నిజమే, క్యాన్సర్ చికిత్సలో అనేకానేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఏ పద్ధతిని ఎంచుకోవాలనేది వ్యాధి తీవ్రత మీద, క్యాన్సర్ రకం మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి.. సర్జరీ, కీమో, రేడియేషన్ థెరపీలలో ఒకట్రెండు పద్ధతుల మేళవింపూ అవసరం కావచ్చు.
* * *
క్యాన్సర్ నిర్ధారణలో బయోమార్కర్స్ పాత్ర పెరుగుతున్నది. ఇవి ఒక రకమైన జీవాణువులు. కణజాలాల్లో, శరీర ద్రవాల్లో, రక్తంలో ఉంటాయి. ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని బేరీజు వేయడానికి ఎంతగానో ఉపయోగపతాయి. మూత్రంలోని చక్కెర ఇందుకు తిరుగులేని ఉదాహరణ. మూత్రంలో అతికొద్దిపాటి చక్కెర ఉండవచ్చు. అసలు ఉండకపోనూవచ్చు. శరీరంలో మితిమీరిన గ్లూకోజ్ ఉన్నప్పుడు.. మూత్రపిండాలు అందులో కొంత భాగాన్ని మూత్రం ద్వారా బయటికి పంపుతాయి. యూరిన్లో గ్లూకోజ్ స్థాయిని బట్టి, రక్తంలో గ్లూకోజ్ మితిమీరి ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇది మధుమేహానికి సూచన. కాకపోతే మరింత కచ్చితత్వం కోసం ఇప్పుడు నిపుణులు బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ ఎంచుకుంటున్నారు. క్యాన్సర్కు సంబంధించి కూడా మొదట్లో ప్రొటీన్లో అనూహ్యమైన మార్పును ఓ బయోమార్కర్గా భావించేవారు. ఆ ప్రొటీన్నే కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ (సీఈఏ) అంటారు. పెద్దపేగు, థైరాయిడ్, ఛాతి, ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను కూడా ఇది వెల్లడిస్తుంది. కాకపోతే ఇందులో నిర్దిష్టత తక్కువ. దీంతో మరింత ఆధునిక మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు నిపుణులు.
లిక్విడ్ బయాప్సీ అలాంటిదే. చిన్నపాటి రక్త పరీక్ష ద్వారా ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ల ఉనికిని, క్యాన్సర్ కణ డీఎన్ఏ కదలికల్ని గుర్తించడం సాధ్యం అవుతున్నది. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. ఇదే సమయంలో కీమో థెరపీ గురించీ ప్రస్తావించాల్సిందే. శస్త్రచికిత్సలు శరీరంలోని ఓ నిర్దిష్ట భాగంలో ఉన్న క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. కీమోలో అలా కాదు.. మూలమూలల్లోని క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ చికిత్సలో కీమో థెరపీ ప్రాధాన్యం పెరుగుతున్నది. కాకపోతే, సంప్రదాయ కీమో థెరపీలో క్యాన్సర్ కణాలతోపాటు, ఆరోగ్యకర కణాలూ నాశనం అవుతాయి. ‘టార్గెటెడ్ డ్రగ్స్’ ఈ దుష్ప్రభావాన్ని నామమాత్రం చేశాయి. ఆరోగ్యవంతమైన కణాలకు హాని చేయకుండా, తమపని తాము చేసుకుపోతున్నాయి.
ఇక ఔషధాల విషయానికి వస్తే.. మొదట్లో అత్యంత శక్తిమంతమైన రసాయనాలను వాడేవారు. ఓ దశలో మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన ఆయుధాల తయారీలో వాడిన సల్ఫర్ మస్టర్డ్లాంటి వాటిని ఉపయోగించేవారు. ఆ దుష్ప్రభావం కొన్నిసార్లు ఎముకమజ్జనూ నుజ్జునుజ్జు చేసేది. అల్సర్లు, వాంతులు, విరేచనాలకు కారణం అయ్యేది. జుట్టు విపరీతంగా రాలిపోయేది. ప్రస్తుతం వీటి వాడకం నామమాత్రంగా మారింది. రేడియేషన్ థెరపీ విషయానికి వస్తే.. మెగా ఓల్టేజ్ ఎక్స్-రే రేడియేషన్ను భారీ డోసేజీలో ప్రయోగించి క్యాన్సర్ కణాలను నాశనం చేయడం ఈ థెరపీ ప్రత్యేకత. క్యాన్సర్ చికిత్సలో యాభైశాతానికి పైగా బాధ్యత రేడియేషన్ థెరపీదే. ఈ ప్రక్రియలో ఆరోగ్యకరమైన కణాలు కూడా కొంతమేర ప్రభావితం అవుతాయి. కాకపోతే, ఆ తర్వాత క్రమంగా కోలుకుంటాయి. టెలీ థెరపీగా పిలిచే ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ అంతకంటే శక్తిమంతమైంది. తాజాగా ప్రొటాన్ థెరపీలాంటి అధునాతన విధానాలు వస్తున్నాయి. నానో టెక్నాలజీ క్యాన్సర్ చికిత్సలో తిరుగులేని ఆయుధం అవుతున్నది. ఇక చిట్టచివరి అస్త్రం .. శస్త్ర చికిత్స. ఈ విధానం శుశ్రుతుడి కాలం నుంచీ ఉన్నదే. గ్రీకు, రోమన్ వైద్యశాస్త్ర రచనలకు చాలా చాలా ముందే.. క్యాన్సర్ ట్యూమర్ల గురించి చర్చించిన తొలి వైద్యుడు ఆయన. ఈ శతాబ్దంలో సర్జరీ విధానాల్లో ఎంతో మార్పు వచ్చింది. సరికొత్త ఉపకరణాల పుణ్యమాని కచ్చితత్వం సాధ్యమైంది. పెద్దపెద్ద కోతల బాధ తప్పింది. చిన్నపాటి గాటు సరిపోతుంది. రోబోటిక్ సర్జరీ మనిషి ప్రతిభకు కృత్రిమ మేధను జోడించింది. దీంతో క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధుల జాబితా నుంచి క్రమంగా తప్పుకొంటున్నది. రోగులు త్వరగా కోలుకుంటున్నారు. తొలిదశలో అయితే శస్త్ర చికిత్స అవసరమే లేకుండాపోతున్నది.
* * *
ఇమ్యునోథెరపీ కూడా తప్పక ప్రస్తావించాల్సిన అంశమే. కీమోథెరపీ నుంచి సర్జరీ వరకు రకరకాల మార్గాల్లో క్యాన్సర్ కణాలను అణచివేయడం ఒక పద్ధతి. ఇమ్యునోథెరపీలో క్యాన్సర్ కణాలను గుర్తించి, పోరాడి, నాశనం చేయడానికి శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తిని అందించే ప్రయత్నం జరుగుతుంది. ఇందుకు అవసరమైన వ్యవస్థను ల్యాబొరేటరీలో సిద్ధం చేస్తారు. ఆ పోరులో ఆరోగ్యవంతమైన కణాలు నష్టపోకుండా ఏర్పాటు చేసే కంచెలాంటి వ్యవస్థలు.. ఇమ్యునలాజికల్ చెక్ పాయింట్స్. వీటితో పెద్దగా చెడు ప్రభావాలు ఉండవు. క్యాన్సర్పై పోరాటంలో సైటోకైన్స్ను ప్రయోగించడం మరో మంచి పరిణామం. గ్రీకుభాషలో సైటో అంటే కణం, కైనోస్ అంటే కదలిక. సైటోకైన్స్ అనేవి.. ప్రొటీన్ ఆధారిత సెల్ సిగ్నలింగ్ ఏజెంట్లు. కణానికి, కణానికి మధ్య సమాచార మార్పిడికి సహకరిస్తాయి. శరీరంలో గాయాలు, వాపులు, ఇన్ఫెక్షన్లు ఉన్న భాగాల వైపుగా కణాల ప్రయాణాన్ని ప్రోత్సహిస్తాయి. ఆ ప్రవాహం హద్దులు దాటినా అనర్థమే. వైద్యనిపుణులు తమదైన నైపుణ్యంతో సమతౌల్యాన్ని సాధిస్తారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ప్రక్రియ రోగి స్థితిని బట్టి డిజైన్చేసే సమకాలీన చికిత్సా విధానం. క్యాన్సర్ కణంలోని నిర్దిష్ట భాగం మీద గురిపెడతాయి. మొత్తంగా ఇమ్యునోథెరపీ ప్రాధాన్యం క్రమక్రమంగా పెరుగుతున్నది. ఇమ్యునాలజిస్ట్ సేవలకు గుర్తింపూ లభిస్తున్నది. మనిషి శరీరానికి ఉన్న పవర్ ఏపాటిదో గుర్తించిన వైద్య విధానమిది. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు జరిగే అవకాశమూ ఉంది.
* * *
కొందరికి క్యాన్సర్ రావడం వ్యక్తిగతంగా తీవ్ర నష్టమైతే కావచ్చు కానీ, సమాజానికి మాత్రం చాలా ఉపయోగం. సెలెబ్రిటీలు క్యాన్సర్కు గురైనప్పుడు, సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. జనంలో అవగాహన పెరుగుతుంది. హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలి క్యాన్సర్ కారక జన్యు ఉత్పరివర్తనాన్ని గుర్తించారు వైద్యులు. దీనివల్ల ఎనభై ఏడు శాతం ఛాతి క్యాన్సర్, యాభై శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉందని ఆమెను హెచ్చరించారు. ఏంజెలినా తల్లి కూడా ఛాతి క్యాన్సర్తోనే మరణించారు. అందుకే ముందుజాగ్రత్తగా జోలి తన రొమ్మును తొలగించుకున్నారు. ‘ఏంజెలినా ఎఫెక్ట్’ అపార ప్రభావం చూపింది. ఎంతోమంది మహిళలు చికిత్సకు ముందుకొచ్చారు. అనివార్య పరిస్థితుల్లో రొమ్ము తొలగించుకోడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రస్తుతానికి వైద్యశాస్త్రం ఆ పరిమితిని కూడా అధిగమించింది. బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ (బీసీటీ) అందుబాటులోకి వచ్చింది. హ్యూమన్ జీనోమ్ సీక్వెన్స్ను అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి భవిష్యత్తులో ఎలాంటి జబ్బుల బారినపడే ఆస్కారం ఉందన్నదీ గుర్తించగలుగుతున్నాం. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ప్రతి ఒక్కరూ జన్యు పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఛాతి, జీర్ణాశయ, పేగు క్యాన్సర్లకు జన్యువులతో అతి దగ్గర సంబంధం ఉంది. పర్యావరణ కాలుష్యం, ధూమపానం, పోషక విలువల లోపం, ఇతర అనారోగ్యాలు, మాదకద్రవ్యాలు, రేడియేషన్, రసాయనాల ప్రభావం కూడా మనిషిని క్యాన్సర్కు దగ్గర చేస్తాయి. భారత్కు సంబంధించినంత వరకూ మూడోవంతు క్యాన్సర్లు స్వయంకృత అపరాధాలే. అందులోనూ సగానికిసగం పొగాకుతో, పావువంతు వివిధ ఇన్ఫెక్షన్లతో ముడిపడినవే. జీవనశైలి మార్పులతో, ముందస్తు జాగ్రత్తలతో క్యాన్సర్ను ఆమడదూరం ఉంచవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఆ కోరల్లో చిక్కుకున్నా.. ఔషధాలతో, ఆత్మవిశ్వాసంతో బయటపడవచ్చు.
ఔషధాలు రోగాన్ని నయం చేస్తాయి. వైద్యుడు రోగికి స్వస్థత ప్రసాదిస్తాడు. ఏ మందులు వాడారన్నదే కాదు, ఏ వైద్యుడు చికిత్స చేశాడన్నది కూడా కీలకమే. క్యాన్సర్ విషయంలో వైద్యుడి ప్రాధాన్యం మరింత ఎక్కువ. రోగిలో వ్యాధిపట్ల భయాన్ని పోగొట్టి, జీవితం పట్ల మమకారం పెంచాల్సింది ఆ తెల్లకోటు వ్యక్తే.
రోబోటిక్ సర్జరీ సమయంలో.. ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుందనే కుతూహలం చాలామందిలో ఉంది. పక్కనే ఉన్న కంప్యూటర్ స్టేషన్లోంచి వైద్య నిపుణుడు రోబోటిక్ చేతులను నియంత్రిస్తాడు. అతిసున్నితమైన పరికరాలతో రోబో హస్తాలు .. చిన్నపాటి గాట్లతో సర్జరీ నిర్వహిస్తాయి. మునుపటిలా పెద్దపెద్ద కోతలు ఉండవు. నొప్పి తక్కువ. రోగి త్వరగా కోలుకుంటాడు. మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదు. నూటికి నూరుపాళ్లు కచ్చితత్వం ఉంటుంది. సాంకేతికత అనేది నిపుణుడైన సర్జన్కు కొత్త బలాన్ని ఇస్తుంది. సర్జరీ ఎలా చేయాలో మాత్రమే కాదు, ఎప్పుడు చేయాలో తెలిసినవాడే గొప్ప సర్జన్ అనిపించుకుంటాడు.
క్యాన్సర్ చికిత్సలో కొన్ని చెడు ప్రభావాలూ ఉన్నాయి. ఆ వైద్య ప్రక్రియ వల్ల డీఎన్ఏకు నష్టం వాటిల్లి.. ఆరోగ్యవంతమైన కణాలు కూడా మార్పునకు లోనవుతాయి. దీంతో కొన్నిసార్లు మానసిక సమస్యలు రావచ్చు. వివిధ భాగాలు విష ప్రభావానికి గురికావచ్చు. అయినా సరే, భయపడాల్సిన పన్లేదు. ఆ విపరిణామాన్ని నివారించే వైద్యపరమైన వ్యూహాలూ ఉన్నాయిప్పుడు. అవసరమైతే డీఎన్ఏకు మరమ్మతులు చేస్తున్నారు. నానో టెక్నాలజీతో క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమని నా బలమైన విశ్వాసం. సమీప భవిష్యత్తులోనే కీమో-ఇమ్యునోథెరపీ కోసం అతి సులువుగా పిచికారీ చేయగల జెల్ లాంటిదేదో అందుబాటులోకి వస్తుందని నా ఆశ. నానో పరమాణువులతో తయారైన ఆ బయోడీగ్రేడబుల్ జెల్ ఇమ్యూన్ వ్యవస్థను శక్తిమంతం చేస్తుందని నా నమ్మకం. తాజా పరిశోధనలు కూడా అందుకు ఉపకరించేలా ఉన్నాయి. దీనికి కృత్రిమ మేధ తోడైతే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో. అంతిమంగా రోగిని బతికించడం, వ్యాధిని నియంత్రించడం వైద్య సాంకేతికత అంతిమ లక్ష్యం. కానీ, ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. వైద్యంలోని మానవతా కోణం సమసిపోకూడదు.
ఎపిడెమియాలజీ.. వ్యాధి మూలాలను పరిశోధించే శాస్త్రం. వైద్య పరిభాషలో చెప్పాలంటే ‘రిస్క్ ఫ్యాక్టర్’ను అధ్యయనం చేసే విభాగం ఇది. సంతానలేమి, ఆలస్య వివాహాలు, పిల్లలకు చనుబాలు ఇవ్వకపోవడం.. ఛాతి క్యాన్సర్కు ఓ కారణమని గుర్తించింది ఇలాంటి ఓ అధ్యయనం ద్వారానే. ధూమపానం, మద్యపానం మనిషి ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయన్నది గుర్తించింది కూడా ఎపిడెమియాలజీ నిపుణులే. జన్యుశాస్త్రం మరింత అభివృద్ధి చెందాక.. వ్యాధి విశ్లేషణ అటువైపు నుంచీ ఎక్కువగా జరుగుతున్నది.
క్యాన్సర్ ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులోకి రావాలి. ఏ నిరుపేద రోగి కూడా మందులు కొనలేని పరిస్థితుల్లో మృత్యువాత పడకూడదు. ఇది మన ఒక్కరి సమస్య కాదు. మూడో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ప్రస్తుతం అరవైకి పైగా క్యాన్సర్ నివారణ ఔషధాలు మార్కెట్లో ఉన్నాయి. వాటి ధరలు నేలకు దిగిరావాల్సిన అవసరం ఉంది. భారత ఫార్మారంగం నాణ్యమైన ఔషధాలకు పేరు. కానీ కీలక మూలకాలను ఇంకా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నది. ఈ విషయంలో స్వావలంబన సాధిస్తే.. మన ఆశ నెరవేరుతుందేమో.
పల్లె నుంచి వైద్య ప్రపంచానికి..
అతనొక సుప్రసిద్ధ రోబోటిక్ సర్జన్. క్యాన్సర్తో ముడిపడిన అనేకానేక చిక్కుముడులకు ఆన్సర్ కనుగొన్న జిజ్ఞాసి. ఆయన ముత్తాత గోదావరి జిల్లా వాసి. సంపన్నుడు. సహృదయుడు. చేతికి ఎములేని మహాదాత. తాత తరానికి వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. నిజాం కర్ణాటకలోని నదీతీర గ్రామానికి వలస వచ్చారు. డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి అక్కడే పుట్టారు. అక్కడే పెరిగారు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. పూరి గుడిసె జీవితం ఆయనది. “కుండపోత వర్షం మా బతుకుల్లో అతిపెద్ద గండమే. ఇల్లు చెరువైపోయేది. ‘దేవుడా వర్షాన్ని ఆపేయవా?’.. అని అమ్మ దేవుణ్ని వేడుకునేది” అంటూ బాల్య జ్ఞాపకాలను నెమరేసుకుంటారు చిన్నబాబు. నవోదయ విద్యాలయాల పేరుతో మాడల్ స్కూల్స్ను స్థాపించాలన్న కేంద్ర సర్కారు నిర్ణయం ఆ రైతు బిడ్డకు వరంగా మారింది. హెడ్మాస్టర్ జయప్ప సార్ ప్రోత్సాహంతో ప్రవేశ పరీక్ష రాసి సీటు తెచ్చుకున్నారు. ఇంటర్ స్థాయిలో గణితం, భౌతిక -రసాయనశాస్ర్తాలు, జీవశాస్త్రం.. చదివే వెసులుబాటు ఉండేది. దీంతో ఇంజినీరింగ్, మెడిసిన్.. రెండు కోర్సుల్లోనూ చేరే అవకాశం లభించేది. చిన్నబాబుకు ఆ రెండు అవకాశాలూ వచ్చాయి. కానీ తను వైద్యశాస్త్రం వైపే ముగ్గు చూపారు. దావణగెరెలోని జగద్గురు మురుగరాజేంద్ర మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. అక్కడ చాలా వరకూ విదేశీ కోటాలో సీట్లు తెచ్చుకున్న ప్రవాసుల పిల్లలే. దీంతో ధనిక-పేద తేడాలు కొట్టొచ్చినట్టు కనిపించేవి. ఆ సమయంలో గ్రంథాలయం నేస్తంగా మారింది. ఎంబీబీఎస్ పట్టా చేతికిరాగానే.. ఉన్నత విద్యకు అవకాశాలున్నా ఏదైనా ఉద్యోగం వెతుక్కుని కుటుంబానికి ఆసరాగా నిలబడాలని అనుకున్నారు చిన్నబాబు. కానీ నియామక ప్రక్రియలో అంతులేని జాప్యం ఆ యువకుణ్ని ఆవేదనకు గురిచేసింది. దీంతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిశ్చయించుకున్నారు. సూరత్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో సీటు సాధించుకున్నారు. అప్పుడే, జగమొండి వ్యాధి క్యాన్సర్ ఆయన దృష్టిని ఆకర్షించింది. గుజరాత్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ చికిత్సలో పట్టు సాధించారు. వైద్య సాంతికేతికతలో నైపుణ్యం సంపాదించి రోబోటిక్ సర్జన్గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం, హైటెక్సిటీలోని యశోద హాస్పిటల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘లివ్ ఫర్ ఎ లెగసీ’ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి జీవిత, వృత్తి అనుభవాల సమాహారం. రచయిత అరుణ్ తివారీతో కలిసి ఈ పుస్తకానికి ప్రాణం పోశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో క్సాన్సర్ పట్ల అవగాహన పెంచుతున్నారు డాక్టర్ చిన్నబాబు.