Covid-19 | గత కొన్నివారాలుగా భారత్లో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. వారానికిపైగా రోజువారీ కేసులు 13వేలకుపైగా నమోదవుతున్నాయి. గత గురువారం 17వేలకుపైగా రికార్డవగా.. గత 24 గంటల్లో 11,739 కేసులు వెలుగు చూశాయి. కేసుల పెరుగుదల నిపుణులతో పాటు ఆరోగ్యమంత్రిత్వ శాఖకు సమస్యలు ఎదురవుతున్నాయి. వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా దర్యాప్తు పరిధిని పెంచాలని కేంద్ర ఆరోగ్యమంత్రి ఇటీవల రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. పెరుగుతున్న కేసుల మధ్య దుష్ప్రభావాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా నివేదికలో నిపుణులు కొత్త వేరియంట్లపై జరిపిన అధ్యయనాల్లో తీవ్రమైన వ్యాధులను కలిగించవని తేలింది.
అయితే, పలువురు వ్యక్తుల్లో తీవ్రమైన సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. మహమ్మారి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కిడ్నీ, లివర్ రోగుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనాతో కలిగే సమస్యలపై తెలుసుకునేందుకు పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. తేలికపాటి లక్షణాలున్నప్పటికీ.. వైరస్ శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుందని చెబుతున్నారు. అవయవాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందని, లక్షణాలు లేని వ్యక్తుల్లో సైతం లాంగ్ కొవిడ్ సమస్యలు కనిపించిన సందర్భాలున్నాయి. ఇదే సమయంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యల కారణంగా ఆసుపత్రి, ఐసీయూలో చేరాల్సి వస్తుందన్నారు.
మెడికల్ రిపోర్ట్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, స్థూలకాయం, హై బీపీతో పాటు కరోనా ఇన్ఫెక్షన్ బాధితులైన చాలా మందిలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (Chronic Kidney Disease-CKD) కనిపిస్తుందని పరిశోధకులు తెలిపారు. కొవిడ్తో కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలను కలిగిస్తాయని కొన్ని అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి.
జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. కొవిడ్ -19 సమయంలో తీవ్రమైన లక్షణాల కారణంగా ఆసుపత్రిలో చేరిన రోగులలో 30 శాతం మంది మూత్రపిండాల గాయం(injury)తో కనిపించారని శాస్త్రవేత్తలు తెలిపారు. కొవిడ్ -19 సమస్యల కారణంగా మూత్రపిండాల వైఫల్యం సమస్య గణనీయంగా పెరుగుతుంది. కరోనా తీవ్రమైన సందర్భాల్లో, రోగులు సాధారణంగా న్యుమోనియా బారినపడే అవకాశం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. దీని ఫలితంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయని, ఈ అసాధారణ ఆక్సిజన్ స్థాయి మూత్రపిండాల సమస్యలను కలిగిస్తుంది. ఇది సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని, ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులను తేలికగా తీసుకోవద్దని, ఎవరికి వారు తాము సురక్షితమేనని భావించొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త కొత్త వేరియంట్ల నేపథ్యంలో టీకాలు వేసిన వారికి ఇబ్బందిగా మారింది. ప్రతి సందర్భంలోనూ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యమని
స్పష్టం చేస్తున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే కిడ్నీ సమస్యలు భయంకరమైన దుష్ప్రభావాలను కలిగిస్తాయని, అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కొవిడ్ తగిన ప్రవర్తనను కొనసాగించడం అనుసరించాలని సూచిస్తున్నారు.