ములకలపల్లి, జూన్ 4: నిరుపేద వ్యవసాయ కూలీ దంపతులకు ఇద్దరు బిడ్డలు. వారిద్దరూ బాగా చదువుకున్నారు. కానిస్టేబుల్ కొలువు సాధించారు. తమ సొంత మండలంలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం.. పోలీస్ కొలువులకు సిద్ధమవుతున్న ఉద్యోగార్థులకు ఆ అక్కాచెల్లెళ్లు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కమలాపురం పంచాయతీ చలమన్ననగర్ గ్రామానికి చెందిన బండారు ప్రసాద్-రోశమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు త్రివేణి, అశ్విని. చిన్న కుమార్తె అశ్విని, 2017లో ఎంబీఏ పూర్తి చేసింది. కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. పెద్ద కుమార్తె బండారు త్రివేణి, ఎంటెక్ పూర్తి చేసింది. 2019లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. వీరిద్దరూ తమ సొంత మండలంలోని పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఆర్థిక వెనుకబాటును అధిగమించి, పట్టుదలతో చదివి, కానిస్టేబుల్ కొలువు సాధించిన తమ బిడ్డలిద్దరినీ చూసి ఆ తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. ఆ ఊరిలోని ఉద్యోగార్థులు స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.
ఎస్సై ఉద్యోగమే లక్ష్యం
మా అమ్మానాన్నలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ మా ఇద్దరినీ చదివించారు. మాకు ఏ లోటూ రానివ్వలేదు. ఎస్సై ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. సెలవు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నా. – బండారు త్రివేణి
ఇంతకన్నా సంతోషం ఇంకేముంటుంది..!
మేమిద్దరం కూలీనాలీ పనులు చేస్తూనే ఇద్దరు ఆడ పిల్లలను చదివించాం. ఒకసారి నాకు రోడ్డు ప్రమాదంలో మోకాలు విరిగింది. మంచానికే అతుక్కుపోయాను. నా భార్యాపిల్లల పరిస్థితి ఏమవుతుందోనని భయపడ్డాను. అప్పుడు నా భార్య ఒక్కతే ఇంటి భారం మొత్తాన్ని మోసింది. పిల్లల చదువుకు ఇబ్బంది రాకుండా చూసుకుంది. మేమిద్దరం తిన్నా.. తినకపోయినా.. పిల్లలకు మాత్రం ఏ లోటూ చేయలేదు. వాళ్లిద్దరూ బాగా చదువుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మాకు ఇంతకన్నా సంతోషం ఇంకేముంటుంది..?! – ప్రసాద్, రోశమ్మ
అమ్మానాన్నలు ఆశించినట్లుగా..
మా అమ్మానాన్నల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేమిద్దరం బాగా చదువుకున్నాం. నేను ఎంబీఏ పూర్తిచేసి ఖాళీగా ఉన్నప్పుడు.. 2017లో కానిస్టేబుల్స్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ పరీక్ష రాసి ఉద్యోగం సంపాదించా.
– బండారు అశ్విని