న్యూఢిల్లీ : కేరళలో ఒమిక్రాన్ వ్యాప్తితో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేరళలో గురువారం అత్యధికంగా 46,387 తాజా కేసులు వెలుగుచూశాయి. మార్చి 2020లో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒక్కరోజులోనే రికార్డుస్ధాయిలో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
గడిచిన 24 గంటల్లో 15,388 మంది కోలుకోగా, వైరస్ బారినపడి ఒక్కరోజులో 309 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్-19తో కేరళలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 51,501కి ఎగబాకింది. ఇక బుధవారం కేరళలో 34,199 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో ఇప్పటివరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 707కు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మరోవైపు భారత్లో గురువారం 3,17,532 తాజా కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి దేశవ్యాప్తంగా 380 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.