మా బాబు వయసు నాలుగేండ్లు. జలుబు చేసినా, వాతావరణం మారినా ఎడతెరిపిలేని దగ్గు, పిల్లికూతలు వస్తాయి. డాక్టర్లు మొదట్లో నెబ్యులైజర్స్ ఇచ్చేవారు. కొంత కుదుటపడినట్టు అనిపించినా, ఆ తర్వాత మళ్లీ ఇబ్బంది మొదలైంది. దీంతో ఇన్హేలర్స్ వాడమని చెబుతున్నారు. ఇలాంటివి పిల్లలకు ప్రమాదకరమని అంటారు. మీ సలహా?
మీ బాబు తరచూ దగ్గు, ఆయాసంతోపాటు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జలుబుతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ సమస్యను ‘హైపర్ యాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. తక్కువ ఉష్ణోగ్రత, కాలుష్యం, హానికర వాయువులు, సిగరెట్-బీడీ పొగ, పెంపుడు జంతువుల మలం, వెంట్రుకలు మొదలైనవాటి ప్రభావంతోనూ, ప్రత్యేకించి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల శ్వాసనాళాలు కుంచించుకుపోయి గాలి తీసుకోవడం కష్టం అవుతుంది. నెబ్యులైజర్, ఇన్హేలర్స్ ద్వారా ఇచ్చే మందులు ఆ నాళాలను విశాలం చేస్తాయి. మీ బిడ్డకు కూడా ఇలాంటి కారణంతోనే వైద్యులు ఇన్హేలర్స్ సిఫారసు చేశారు. ఇది సురక్షిత విధానం. నెబ్యులైజర్తో పోలిస్తే ఇన్హేలర్లో మందు మోతాదు తక్కువ. మీ బిడ్డకు ఎలాంటి ఇన్హేలర్ ఇచ్చారో చెప్పలేదు. ఇందులో రెండు రకాలు. ఒకటి.. బ్రౌన్ ఇన్హేలర్. ఇది అతి తక్కువ గాఢత కలిగిన ఇన్హేలర్ స్టెరాయిడ్. అందుకే దీన్ని ‘ప్రివెంటర్’ అంటారు. లక్షణాలు తగ్గాయి కదా అని మానేయకూడదు. పూర్తి కోర్సు వాడాలి. మరొకటి.. బ్లూ ఇన్హేలర్. ఇది శ్వాసనాళాలను విశాలం చేస్తుంది.
దీంతో తక్షణ ఉపశమనం కలుగుతుంది. రోజుకు ఆరుసార్ల వరకూ వాడవచ్చు.
పెద్దలు తీసుకున్నట్టు పిల్లలు నేరుగా ఇన్హేలర్ తీసుకోలేరు. అందుకే, తీవ్రస్థాయిలో లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఇన్హేలర్ వాడాలనే అపోహ తల్లిదండ్రులలో ఉన్నది. ఇది నిజం కాదు. సిరప్ కంటే ఇన్హేలరే సరైనది. సిరప్ శరీరంలోకి వెళ్లి.. రక్తంలో కలిసి వివిధ భాగాలకు వెళుతూ.. ఊపిరితిత్తులకూ చేరుతుంది. అదే ఇన్హేలర్ నేరుగా సంబంధిత వ్యవస్థను చేరుకుంటుంది. ‘ఇవేమైనా ఆస్తమా లక్షణాలా?’ అని కంగారు పడుతుంటారు చాలామంది. కానీ, భయపడాల్సిన పన్లేదు. మనకు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య విధానంతో ఆస్తమాను అయినా సరే.. తప్పక నయం చేయవచ్చు. మీరు బిడ్డ లక్షణాలను, ఇన్హేలర్ మోతాదును ఓ పుస్తకంలో రాసిపెట్టండి. వైద్యులు వాటిని బేరీజు వేసి.. చికిత్స, డోసేజ్ నిర్ణయిస్తారు. ఇన్హేలర్ వల్ల కూడా సమస్య నియంత్రణలోకి రాకపోతే, రెస్పిరేటరీ పీడియాట్రీషియన్ను సంప్రదించడం మంచిది. ఇంట్లో ఎవరూ ధూమపానం చేయకుండా చూడండి. పరిసరాల్లో తేమ లేకుండా చూసుకోండి. సాంబ్రాణి లాంటి పొగలూ వద్దు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే.. రుగ్మతను తప్పక నియంత్రించవచ్చు.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్