హలో డాక్టర్. మా పాప వయసు పన్నెండేండ్లు. గత ఏడాది రజస్వల అయ్యింది. కానీ, నెలసరి సక్రమంగా రావడం లేదు. ఒకసారి నెలకు వస్తే, మరోసారి నెలన్నరకు వస్తుంది. ఇది సహజమేనా, కొంచెం పెద్దయితే సర్దుకుంటుందా?
చాలామంది పిల్లల్లో రజస్వల అయిన రెండు మూడు సంవత్సరాల దాకా నెలసరి సక్రమంగా రాదు. ఆ తర్వాతే, క్రమబద్ధం అవుతుంది. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నదా అన్నదీ గమనించాలి. పిల్లల కోణంలో చెప్పాలంటే, రోజులో మూడుసార్లు శానిటరీ ప్యాడ్లు మార్చుకునేంత వరకూ ఫర్వాలేదు. రెండు నుంచి ఏడు రోజుల పాటు స్రావం అయినా ఇబ్బంది లేదు. అంతకన్నా ఎక్కువ రోజులు మాత్రం కాకూడదు. అలాగే బ్లీడింగ్ సాధారణంగా ఉందా, అందులో గడ్డలు పడుతున్నాయా అన్నది కూడా తెలుసుకోవాలి. తీవ్రమైన కడుపునొప్పి, స్రావంలో గడ్డలు పడటం అనారోగ్య సంకేతాలు. తప్పకుండా డాక్టరును సంప్రదించాలి. ఇవేవీ లేనప్పుడు నెలసరి అటూ ఇటూ అయినా భయపడాల్సిన పన్లేదు.