Cancer | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సరికొత్త దివ్యాస్త్రం అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా రూపొందించిన ‘కార్-టీ సెల్’ థెరపీతో క్యాన్సర్ భూతాన్ని ఖతం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇమ్యునోయాక్ట్, ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్ దవాఖాన పరిశోధకులు సంయుక్తంగా ఈ థెరపీని అభివృద్ధి చేశారు. దీనిని రోగులపై ప్రయోగించేందుకు కొద్ది నెలల క్రితం భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోదముద్ర వేసింది. 15 మందికి ‘కార్-టీ సెల్ థెరపీ’ అందించగా, ముగ్గురు పేషెంట్లు క్యాన్సర్ నుంచి బయటపడ్డారని తెలిసింది. సరికొత్త థెరపీతో క్యాన్సర్ను జయించిన మొదటి పేషెంట్గా ఢిల్లీకి చెందిన గుప్తా నిలిచారు. ‘2022లో బోన్మ్యారో మార్పిడి విఫలమైంది. కొద్ది రోజులే బతుకుతాననుకున్నా. తర్వాత ముంబై, టాటా మెమోరియల్ దవాఖానలో కార్-టీ సెల్ థెరపీ తీసుకున్నా. రూ.42 లక్షలు ఖర్చయింది. విదేశాల్లో రూ.3-4 కోట్ల వరకు అవుతుంది’ అని చెప్పారు.
క్యాన్సర్ బారిన పడ్డాక, రోగి శరీరంలోని తెల్లరక్త కణాలు వాటిని గుర్తించవు. దీంతో క్యాన్సర్ కణాలు పెరిగి.. రోగం ముదురుతుంది. దీన్ని అడ్డుకునేందుకు వైద్యులు అభివృద్ధి చేసిన థెరపీనే ‘కార్-టీ సెల్’. తొలుత పేషెంట్ తెల్లరక్త కణాల్ని వైద్యులు సేకరిస్తారు. వాటిని జన్యుమార్పిడి చేసి పేషెంట్కు ఇంజెక్షన్ ద్వారా అందిస్తారు. రోగి శరీరంలో చేరిన ‘కార్-టీ సెల్స్’ క్యాన్సర్ కణాల్ని గుర్తించి అంతమొందిస్తాయి. కీమోథెరపీ ఫెయిలయిన కేసుల్లోనూ ‘కార్-టి సెల్’ అద్భుతంగా పనిచేస్తుందని ‘ఇమ్యునోయాక్ట్’ సీఈవో డాక్టర్ రాహుల్ చెబుతున్నారు.
కార్-టీ సెల్ థెరపీకి సీడీఎస్సీవో అనుమతి పొందాల్సి ఉంది. చండీగఢ్లోని ప్రఖ్యాత పీజీఐఎంఈఆర్ దవాఖాన సహా పలు హాస్పిటల్స్ ఈ థెరపీపై క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాయి. ‘ఈ విధానంలో ప్రస్తుతానికి బి-సెల్ క్యాన్సర్పై మాత్రమే విజయం సాధించాం. శరీరం నుంచి ఆ క్యాన్సర్ కణాల్ని పూర్తిగా వెళ్లగొట్టగలిగాం. ఇక జీవితంలో మళ్లీ క్యాన్సర్ రాదని భావించలేం. మరిన్ని క్లినికల్ ట్రయల్స్ జరపాలి’ అని డాక్టర్ హస్ముఖ్ జైన్ అన్నారు. డాక్టర్ గుప్తాకు కార్-టీ సెల్ థెరపీ చికిత్సను అందించిన డాక్టర్ ఈయనే.