న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 86.51 కోట్ల కొవిడ్-19 టీకా డోసులు సరఫరా కాగా అక్టోబర్ నెలలో ఏకంగా 28 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ చేపట్టనున్నారు. థర్డ్ వేవ్ ఆందోళనల నడుమ అర్హులైన జనాభా అంతటికీ సత్వర వ్యాక్సినేషన్ చేపట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అక్టోబర్లో 27 కోట్ల నుంచి 28 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రానుండగా బయలాజికల్ ఈ, జైడస్ క్యాడిలా టీకాల పంపిణీ అప్పటికి అందివచ్చే అవకాశం ఉంది. ఇక 63.69 లక్షల టీకా డోసులు ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా టీకా డోసులు పెద్దసంఖ్యలో అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుందని పేర్కొన్నాయి.