న్యూయార్క్ : 2020కి ముందు పెద్దల్లో హృద్రోగాలతో సంభవించే మరణాల రేటు క్రమంగా దిగిరాగా, కరోనా మహమ్మారి తర్వాత మధ్యతరగతి, యువకుల్లో మరణాల రేటు పెరిగిందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)కు చెందిన ఎపిడెమాలజిస్ట్ వెల్లడించారు. హృద్రోగ తీవ్రత నియంత్రణలో అంతకుముందు పలు దశాబ్ధాలుగా సాగించిన పురోగతి కరోనా మహమ్మారితో తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు.
1990ల నుంచి అమెరికాలో హృద్రోగ మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే 2020లో చేపట్టిన గణాంకాల సమీక్షలో అన్ని వయసుల వారు, లింగ, వర్ణ వ్యత్యాసాలు లేకుండా హృద్రోగా మరణాల రేటు పెరిగిందని వెల్లడైందని అధ్యయన రచయిత, సీడీసీకి చెందిన రెబెకా సీ వుడ్రఫ్ తెలిపారు. నవంబర్ 5-7న చికాగోలో జరిగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్లో ప్రాధమిక పరిశోధన వివరాలను సమర్పిస్తారు.
కొవిడ్-19 మహమ్మారి ముందస్తు ఆరోగ్య సంరక్షణ పొందడం సహా దైనందిన జీవితంలో పలు అడ్డంకులు ఏర్పరిచిందని, దీంతో హృద్రోగాలను ముందుగా గుర్తించి చికిత్స అందించడంలో జాప్యం నెలకొందని వుడ్రఫ్ః వివరించారు. హృద్రోగ మరణాలు మరింత పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నామని చెప్పారు. 2010 నుంచి 2019 వరకూ జాతీయ హృద్రోగ మరణాల రేటు 9.8 శాతం తగ్గగా, 2020లో ఇది 4.1 శాతం ఎగబాకిందని ఆందోళన వ్యక్తం చేశారు.